విద్యార్ధులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపిస్తాం:Indra karan reddy

ABN , First Publish Date - 2022-05-26T22:21:15+05:30 IST

వ‌ర్త‌మాన స‌మాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర – సాంకేతిక రంగాల వైపు న‌డిపించేందుకు, సంబంధిత రంగాల్లో విష‌య వివేచ‌న పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indra karan reddy) అన్నారు.

విద్యార్ధులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపిస్తాం:Indra karan reddy

హైద‌రాబాద్: వ‌ర్త‌మాన స‌మాజానికి అనుగుణంగా విద్యార్థులను  శాస్త్ర – సాంకేతిక రంగాల వైపు  న‌డిపించేందుకు, సంబంధిత రంగాల్లో విష‌య వివేచ‌న పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indra karan reddy) అన్నారు. స్వ‌రాష్ట్రంలో తెలంగాణ శాస్త్ర‌, సాంకేతిక మండ‌లి సాధించిన విజ‌యాలు, ప్ర‌గ‌తిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల‌ను మార్చేందుకు టీఎస్‌కాస్ట్ (TSCOST) మంచి ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంద‌ని చెప్పారు. రూ.14.51 కోట్ల‌తో  వినూత్నంగా 7 ప్రాజెక్ట్ ల‌ను అమ‌లు చేస్తుంద‌ని, వాటిలో వరంగల్ లోని రీజిన‌ల్  సైన్స్ సెంట‌ర్ (ఆర్‌ఎస్‌సీ) లో ఇన్నోవేషన్‌ హబ్, విశ్వవిద్యాలయాలు/పరిశోధనా సంస్థల్లో ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ కింద స్కిల్ డెవలప్‌మెంట్‌, వరంగల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఎస్‌-ఎస్‌టీ సెల్‌ ఏర్పాటు, నేషనల్‌ సైన్స్ డే & నేషనల్‌ మ్యాథమ్యాటిక్స్ డే వేడుకలు, త‌దిత‌ర  కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తుంద‌ని పేర్కొన్నారు.  


రూ. 42.41 కోట్ల‌తో నిర్మ‌ల్ లో సైన్స్ సెంటర్‌, ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వానికి  ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌న్నారు. సైన్స్ సెంట‌ర్ కు 5 ఎక‌రాల స్థ‌లాన్ని ఇప్ప‌టికే కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం త‌ర్వాత ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్ సోషల్ స్టడీస్‌ (CESS), టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (TISS), జవహర్‌ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNFAU) సహకారంతో టీఎస్‌కాస్ట్ ఆద్వ‌ర్యంలో  ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏర్పాటు  చేసి, ఈ ప్రాజెక్టును  అమలు చేస్తామ‌న్నారు.  


మొత్తం 8 క్ల‌స్ట‌ర్ల‌ను ఎంపిక చేసి  ఎస్సీ క్యాట‌గిరీలోవరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం, మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి మండలం, ఖమ్మం జిల్లా   బోనకల్లు మండలం, నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలాల్లో 5 క్ల‌స్ట‌ర్లు, ఎస్టీ క్యాట‌గిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారం 3 క్ల‌స్ట‌ర్లను ఎంపిక చేశామ‌న్నారు. వరంగల్‌ రీజినల్‌ సైన్స్‌ సెంటర్ దీన్ని ఏర్పాటు  చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విద్యావంతులైన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి లేదా వ్యవస్థాపక కార్యకలాపాలు చేపట్టేలా నైపుణ్య శిక్షణ  ఇస్తార‌న్నారు.


 మొద‌టి సంవ‌త్స‌రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల  సామాజిక‌, ఆర్థిక స్థితిగ‌తుల‌పై స‌మ‌గ్ర‌ ఆధ్య‌య‌నం, రెండ‌వ సంవ‌త్స‌రంలో  వారి జీవ‌న ప్ర‌మాణాల పెంపొందించేందుకు త‌గిన‌ శిక్ష‌ణ‌, మూడ‌వ సంవ‌త్స‌రంలో శాస్త్ర‌, సాంకేతిక ఆధారిత యంత్రాల‌ను, ప‌రిక‌రాల‌ను అంద‌జేస్తామ‌ని పేర్కొన్నారు.రూ 2.88 కోట్ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా  8 (ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ,  శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, హైదరాబాద్ జవహర్‌ లాల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్స్ సైన్సెస్ )  యూనివ‌ర్సిటీల్లో పేటెంట్‌ ఇన్ఫర్మేషన్ సెంటర్  (PIC) ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌న్నారు. 


పేటెంట్లు, కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్‌లు మొదలైన మేధో సంపత్తి హక్కులపై (IPRలు) పరిశోధకులు, ఆవిష్కర్తలు, కంట్రిబ్యూటర్లు, డిజైనర్లు మొదలైన వారికి అవగాహన కల్పించడం,  IPR ప్రక్రియను సులభతరం చేసేందుకు సమన్వయం చేసుకోవడం వంటి వాటిని  PIC ప్రధానంగా నిర్వహిస్తుంద‌ని తెలిపారు. సైన్స్‌ అండ్ టెక్నాలజీ  ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ర‌జ‌త్ కుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో టీఎస్‌కాస్ట్  మెరుగైన ప్ర‌గ‌తి సాధించింద‌ని, టీఎస్‌కాస్ట్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ మారుపాక న‌గేష్, ఉద్యోగులు, సిబ్బందిని ఈ సంద‌ర్భంగా మంత్రి ప్ర‌త్యేకంగా అభినందించారు.   

Updated Date - 2022-05-26T22:21:15+05:30 IST