ఆధ్మాత్మికతతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-08-09T20:13:44+05:30 IST

నిర్మ‌ల్ జిల్లాలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సోమ‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో సమీక్ష నిర్వహించారు.

ఆధ్మాత్మికతతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైద‌రాబాద్: నిర్మ‌ల్ జిల్లాలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులపై  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సోమ‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో సమీక్ష నిర్వహించారు. బాస‌ర‌ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, అడెల్లి పోచ‌మ్మ‌, కాల్వ శ్రీ లక్ష్మినర్సింహా స్వామి, కదిలి శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై  మంత్రి సమీక్షలో చర్చించారు. వివిధ ఆల‌యాల్లో కొన‌సాగుతున్న ప‌నులు, త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే ప‌నుల‌కు సంబంధించి అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా మంత్రికి వివ‌రించారు. స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆధ్మాత్మిక‌తో పాటు  మాన‌సిక ఆహ్లాదం క‌లిగించేలా  ఆల‌యాల ప‌రిసరాల‌ను  తీర్చిదిద్దాల‌న్నారు. 


ఎకో టూరిజానికి క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నప్పటికీ టెంపుల్ టూరిజానికి కూడా భ‌క్తులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బాస‌ర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి  భ‌క్తులు వ‌స్తున్నార‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని స‌దుపాయాలు క‌ల్పించేలా దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికారులకు నిర్దేశించారు. ముఖ్యంగా భ‌క్తుల‌కు విడిది సౌక‌ర్యం, క్యూ కాంప్లెక్స్, తాగునీరు, షాపింగ్ కాంప్లెక్స్, త‌దిత‌ర సౌక‌ర్యాలు, న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని సుంద‌రీక‌రించ‌డంతో పాటు గోదావ‌రి న‌దికి హ‌ర‌తీనిచ్చే ప్రాంతాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్ద‌డం, బోటింగ్ కు త‌గిన  ఏర్పాట్లు చేయాల‌న్నారు. బాస‌ర‌లో ఆధ్యాత్మిక టూరిజాన్ని మ‌రింత అభివృద్ధి చేయాల‌ని పేర్కొన్నారు. 


బాస‌ర‌లో ఇప్ప‌టికే రూ. 8 కోట్ల‌తో ఆల‌య అభివృద్ధి ప‌నులు వేగంగా జరుగుతున్నాయ‌ని, బాస‌ర‌తో పాటు అడెల్లి, కాల్వ‌, క‌దిలి ఆల‌యాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ శిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని  సూచించారు. అడెల్లి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు కావాల్సిన భూ సేక‌ర‌ణ‌కు త‌గిన ప్ర‌తిపాద‌న‌లు రూపొందించి క‌లెక్ట‌ర్ కు అంద‌జేయాల‌న్నారు. పుణ్య‌స్నానాల‌కు ప్ర‌త్యేకంగా ష‌వ‌ర్లు (నీటీ జ‌ల్లు స్నానం) ఏర్పాటు చేయాల‌ని, కోనేటిలో స్వ‌చ్చ‌మైన నీరు ఉండేలా చూడాల‌న్నారు. 


డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డం, అంత‌ర్గ‌త రోడ్ల విస్త‌ర‌ణ‌, పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక ఆట స్థ‌లం, భ‌క్తుల‌కు  విడిది గృహాలు, వీఐపీ గెస్ట్ రూంలు, బ‌యో టాయ్లెట్స్ నిర్మించాల‌ని సూచించారు. కాల్వ దేవస్థానంలో  కోనేటిని అభివృద్ధి ప‌ర‌చ‌డంతో పాటు భ‌క్తుల‌కు మ‌రిన్ని మెరుగైన సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆల‌యాల్లో భ‌క్తుల‌కు క‌ల్పించే ప‌లు స‌దుపాయాల కోసం దాత‌లు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాల‌ని మంత్రి కోరారు.సమీక్షలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, స్త‌ప‌తి శ్రీవ‌ల్లినాయ‌గం, సీఈ  జి. సీతారాములు, బాస‌ర ఈవో వినోద్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-09T20:13:44+05:30 IST