ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-09-11T21:01:01+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం బోగ్గులకుంటలో దేవాదాయశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల విషయంలో రాజీపడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యలుంటే  ఉన్నతాధికారులకు  కానీ....లేదంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన  దేవాలయాల్లో  జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి  ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన  దేవాదాయ భూముల పరిరక్షణకు అధికారులు చితశుద్ధితో పని చేయాలన్నారు. ఆలయ భూమికి  దేవుడే యజమాని అని ఇటీవల సుప్రీం కోర్టు  తీర్పునిచ్చిన నేపథ్యంలో


ఆలయ భూములపై సమగ్ర నివేదిక తెప్పించకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో  దేవుని పేరు మీద కొత్త పాస్ బుక్ లు  తీసుకోవాలన్నారు. ధరణి వెబ్ సైట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్  శాఖలో నిషేధిత జాబితాలో ఆలయ భూములు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హై కోర్టు, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ లో మెమోలు ఫైల్ చేసి, కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరవుతూ తదనుగుణంగా తుది ఉత్తర్వులు వచ్చే వరకు నిరంతరం ఫాలో ఆప్ చేయాలన్నారు. దేవాదాయ భూములు పరాధినం కాకుండా కాకుండా చూడటంతో పాటు కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఆలయ భూముల లీజ్ వ్యవహారంలో కొందరు అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


లీజు బాకాయిల విషయంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.కరోన వల్ల దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో పాటు ఆదాయం గణనీయంగా పడిపోయిందని, తదనుగుణంగా అనవసర వ్యయాలను నియంత్రించాలన్నారు.భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ భూముల పరిరక్షణ, ఆదాయ వృద్ధి అనేవి సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఆలయ భూముల వినియోగం,ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా  ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ఆలయ ఆదాయ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని, క్యాష్ బుక్ లో  ఎప్పటికప్పుడు ఆదాయ వ్యయాలను అప్డేట్ చేయాలన్నారు.సేవలకు ఉపయోగించని ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీం క్రింద జమా చేయడంతో పాటు రక్షణతో కూడిన అధిక వడ్డీ వచ్చేలా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో  దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇంఛార్జి అడిషనల్  కమిషనర్ కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్లు, సహాయక కమిషనర్లు, ఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-11T21:01:01+05:30 IST