రూ.11 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం: Indra karan reddy
ABN , First Publish Date - 2022-05-04T21:02:31+05:30 IST
జిల్లాలోని అడెల్లి పోచమ్మ ఆలయాన్ని రూ.11 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
నిర్మల్: జిల్లాలోని అడెల్లి పోచమ్మ ఆలయాన్ని రూ.11 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం అడెల్లి పోచమ్మను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి,అక్కడే దేవాలయ అభివృద్ధిపై స్తపతి, అధికారులు, సంబంధిత ఇంజినీర్లతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా Indra karan reddy మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి అని చెప్పారు.
అడెల్లి పోచమ్మ దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. రూ. 11 కోట్లతో దశలవారీగా ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో రూ. 3 కోట్లతో గర్భ గుడి, అర్థ మండమ, విమాన గోపుర నిర్మాణంతో జూన్ మూడో వారంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అప్పటిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఆలయ విస్తరణ నిర్మాణం చేపట్టనుండటంతో బాలాలయం నుంచి భక్తులకు అమ్మవారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. యాదాద్రి తరహాలో కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం జరగనున్నట్లు మంత్రి తెలిపారు. అద్భుతమైన శిల్పాలతో అమ్మవారి ఆలయం కొత్త రూపాన్ని సంతరించుకోనుందని పేర్కొన్నారు.