ప్రజలపై పన్నుల భారం మోపుతున్న బీజేపీ

ABN , First Publish Date - 2021-10-24T08:15:19+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని, సర్‌చార్జీల పేరిట సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు వసూలు ..

ప్రజలపై పన్నుల భారం మోపుతున్న బీజేపీ

  • సర్‌చార్జీల పేరిట ఏటా రూ.2.5 లక్షల కోట్లు వసూళ్లు: హరీశ్‌రావు 
  • కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు 15 ప్రశ్నలతో  లేఖ


జమ్మికుంట/హుజూరాబాద్‌, అక్టోబరు 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని, సర్‌చార్జీల పేరిట సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తోందని మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌ మీద లీటర్‌కు కొత్తగా 28, పాతవి పది రూపాయాలతో కలిపి మొత్తం 38 రూపాయల పన్నును కేంద్రం వసూలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రం విధించే పన్నులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ సిలిండర్‌పై 291 రూపాయల పన్ను వసూలు చేస్తున్నట్లు నిరూపిస్తే జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా అని ఈటల రాజేందర్‌కూ సవాల్‌ విసిరి పది రోజులు గడుస్తున్నా స్పందన లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతా అని ఈటల రాజేందర్‌ అంటున్నాడని, ఎందుకు కూల గొడుతాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు 15 ప్రశ్నలతో కూడిన లేఖను హరీశ్‌రావు రాశారు. 

Updated Date - 2021-10-24T08:15:19+05:30 IST