Dialysisలో బీఎంజేఆర్ఎఫ్టీ రికార్డ్
ABN , First Publish Date - 2021-11-14T15:48:26+05:30 IST
నగరానికి చెందిన ఎన్జీవో భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ట్రస్ట్ (బీఎంజేఆర్ఎఫ్టీ) అక్టోబర్ 14 నాటికి పది లక్షల డయాలిసిస్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది
ఇప్పటి వరకు పది లక్షల మందికి సేవలు
12 వేల మంది రోగులకు రూ. 100 కోట్లు ఖర్చు
జైన్ల స్మృతి చిహ్నాన్ని విడుదల చేసిన మంత్రి హరీష్రావు
హైదరాబాద్/బోయినపల్లి: నగరానికి చెందిన ఎన్జీవో భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ట్రస్ట్ (బీఎంజేఆర్ఎఫ్టీ) అక్టోబర్ 14 నాటికి పది లక్షల డయాలిసిస్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్లోని జీవెల్ ఇంపీరియల్ గార్డెన్లో ‘‘వన్ మిలియన్ డయాలసిస్ 2021 పేరిట’’ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, స్టేషన్ కమాండర్ తాసా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రెసిడెంట్ అభిజిత్ చంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జైన్ల స్మృతి చిహ్నాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం 12 వేల మంది డయాలసిస్ రోగుల కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఏడాదిలో 150 మంది రోగులకు ఉచితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సేవలందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మూడు డయలాసిస్ సెంటర్లు ఉండగా, ప్రస్తుతం 43 ఉన్నాయని వివరించారు. భగవాన్ మహావీర్ డయాలసిస్ కేంద్రాలను ప్రజలు ‘మానవత్వం యొక్క దేవాలయాలు’ అని పిలుచుకుంటున్నారని తెలిపారు. సంస్థకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 2009లో ఐదుగురు రోగులకు డయాలసిస్ చేసి బీఎంజేఆర్ఎఫ్టీ తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రస్తుతం 189 యంత్రాలతో, నాలుగు అసోసియేట్ ఆస్పత్రులతో, ఎనిమిది కేంద్రాలతో ట్రస్ట్ నడుస్తోందన్నారు. జంటనగరాల్లో 1100 మందికి పైగా రోగులకు డయాలసిస్ సేవలను అందిస్తున్న సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.