కులవృత్తులను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు: Harish rao
ABN , First Publish Date - 2022-05-24T00:22:52+05:30 IST
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు(harish rao) తెలిపారు.
హైదరాబాద్: గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు(harish rao) తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD)లోరాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలు పై సోమవారం మంత్రి హరీష్ రావు, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) లు సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు అమలు చేస్తున్న పథకాలైన ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ మరియు పాడి పశువుల పంపిణీ తదితర పథకాల పై జరిగిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తగిన సూచనలు సలహాలను ఈ సమావేశంలో ఇరువురు మంత్రులు అధికారులకు వివరించారు.
అంతేకాకుండా పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం, రావిర్యాల లో నిర్మిస్తున్న మెగా డైరీ నిర్మాణ పనుల పురోగతి పై సమీక్షించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వనరులలో చేప పిల్లలు మరియు రొయ్య పిల్లల విడుదలపై కూడా సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా,మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, డైరీ అధికారులు పాల్గొన్నారు.