హరీశ్రావు ప్రచారంలో అలవాటులో పొరపాటు
ABN , First Publish Date - 2021-10-12T00:03:01+05:30 IST
ఉపఎన్నికలో ప్రచారహోరు మోత మోగిపోతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలై పోయాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్..
హుజూరాబాద్: ఉపఎన్నికలో ప్రచారహోరు మోత మోగిపోతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలై పోయాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బి. వెంకట్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగింది. మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం. 13తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. మరోవైపు అభ్యర్థులు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. అయితే ఆయన ప్రచారం చేస్తుండగా అలవాటులో పొరపాటు దొర్లింది. మంత్రి హరీశ్ రావు కాన్వాయ్లో ఉన్న ఓ కార్యకర్త సీఎం కేసీఆర్కు జై కొడుతూ ఈటల రాజేందర్ నాయకత్వం వర్దిల్లాలి అని నినదించారు. దీంతో అదే కాన్వాయ్లో ఉన్న పాడి కౌసిక్ రెడ్డి కూడా ఈటల నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదం చేశారు. వెంటనే మంత్రి హరీశ్రావు మైక్ తీసుకుని ఈటల రాజేందర్తో 15 ఏళ్ల బంధం అంటూ అలవాటులో పొరపాటు ఉంటుందని కవర్ చేశారు.