మత్స్యకారులకు మంచి రోజులు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-03-27T19:48:39+05:30 IST

మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

మత్స్యకారులకు మంచి రోజులు: హరీష్‌రావు

హైదరాబాద్: మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ..  మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి ఆలోచన చేశారని చెప్పారు. చేపలు తినాలని ఉన్న హైదరాబాద్‌లో ఒకటి రెండు చోట్ల మాత్రమే లభిస్తాయని.. అందరూ తినే అవకాశం లేదు కనుక సంచార చేపల విక్రయ వాహనాలతో చాలా మంది వినియోగదారులకు ఉపయోగముంటుదని మంత్రి హరీష్‌రావు తెలిపారు. 150 డివిజన్‌లలో 150 వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


మత్స్య పరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని స్పష్టం చేశారు.  తెలంగాణలో చెరువులకు మహర్దశ వచ్చిందన్నారు. నిండు వేసవిలో  చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు, మత్స్యకారులకు చేపలను ఉచితంగా ఇస్తున్నామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. సీఎం కేసీఆర్ వెజ్ ,నాన్ వెజ్ మార్కెట్లకు 500 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలకు ఈ వాహనాలు ఇవ్వాలని  కేసీఆర్‌ని కోరామని మంత్రి హరీష్‌రావు చెప్పారు.


ఈ వాహనాల ద్వారా  5 నుంచి 6 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మత్స్యకారులు దురదృష్టవశాత్తు చనిపోతే ప్రభుత్వం 6 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా ఇస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో చేపల పరిశ్రమకు సంబంధించి పలు పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే అవకాశం ఉందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, అరికెపుడి గాంధీ, భేతి సుభాష్‌రెడ్డి, ఎంపీలు, బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత , స్థానిక కార్పొరేటర్ విజయ‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-27T19:48:39+05:30 IST