త్వరలో కొత్త గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు:Errabelli
ABN , First Publish Date - 2022-05-23T22:18:31+05:30 IST
త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు, రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇందుకు సీఎం కేసిఆర్ సరిపడా నిధులు ఇచ్చారని పంచాయతీరాజ్(panchayatiraj) శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) తెలిపారు.
హైదరాబాద్: త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు, రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇందుకు సీఎం కేసిఆర్ సరిపడా నిధులు ఇచ్చారని పంచాయతీరాజ్(panchayatiraj) శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) తెలిపారు.ముఖ్యమంత్రి ఆదేశానుసారం త్వరలోనే ఎస్టీ శాసన సభ్యులతో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తామని అన్నారు. అలాగే నిధుల విడుదల వంటి పలు అంశాలపై చర్చించడానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో త్వరలో భేటీ అవుతామని ఆయన చెప్పారు. ఎస్టీ గ్రామాల రోడ్లు, డ్రైనేజీ, కొత్త గ్రామ పంచాయతీ భవనాలు వంటి మౌలిక వసతులపై సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేషీలో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డితో కలిసి ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వివరించారు.కొత్త గ్రామ పంచాయతీల భవనాలు, మౌలిక సదుపాయాల కోసం సిఎం కెసిఆర్ బడ్జెట్లో వెయ్యి కోట్లు పెట్టారు. ఆదిమ తెగల గూడాల్లో రోడ్ల కోసం పంచాయతీరాజ్ శాఖ 70 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ 70 కోట్లు మొత్తం 140 కోట్లు రెడీగా ఉన్నాయి. ఇవేగాక రాష్ట్రంలోని 2400 కొత్త గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణం కోసం 300 కోట్లు పంచాయతీరాజ్, 300 కోట్లు గిరిజన సంక్షేమ నిధులు ఇవ్వనున్నాయన్నారు.
త్వరలోనే గిరిజన, ఆదివాసీ గూడాల్లో తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతామని మంత్రులు వివరించారు. అయితే, ఈ నిధులు వినియోగంపై ఎస్టీ శాసన సభ్యులతో ఒక సమావేశం నిర్వహిస్తామని, అలాగే ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఒక భేటీ ఉంటుందని మంత్రులు తెలిపారు. ఈ లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు మంత్రులు వివరించారు.