టీఆర్ఎస్ ధర్నాతోనే కేంద్రం చట్టాలను రద్దు చేసిందన్న Errabelli
ABN , First Publish Date - 2021-11-19T18:13:39+05:30 IST
రైతు చట్టాల రద్దుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు.
హనుమకొండ: రైతు చట్టాల రద్దుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. నిన్నటి టీఆర్ఎస్ పార్టీ ధర్నాతోనే కేంద్రం చట్టాలను రద్దు చేసిందన్నారు. అదే స్పూర్తితో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నూతన వ్వయసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు అభినందనలు తెలియజేశారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను మొదటి నుంచి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. రైతుల సంక్షేమాన్ని కోరేది టీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేసినా.. కేసీఆర్ తలొగ్గలేదని... రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ధర్నాలు చేసిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.