రైతు బంధుతో తెలంగాణలోని ప్రతి ఇంటా సంక్రాంతి: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2022-01-14T20:14:22+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయతక్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజామోద, ప్రజోపయోగ పథకాలతోపాటు, రైతు అనుకూల, రైతులకు మేలు చేసే రైతు బంధు,
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయతక్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజామోద, ప్రజోపయోగ పథకాలతోపాటు, రైతు అనుకూల, రైతులకు మేలు చేసే రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి పథకాల ద్వారా నిజమైన సంక్రాంతి వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ వచ్చే నాటికి దండుగగా మారి, రైతంటే, పిల్లను ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి నుంచి, పంటల పెట్టుబడిగా రైతు బంధుని ప్రతి ఏటా ఎకరాకు 10వేల చొప్పున ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. సాగునీరందిస్తూ, 24 గంటలపాటు కోతలు లేని, నాణ్యమైన ఉచిత విద్యుత్ని అందిస్తూ, రైతుల రుణాలను మాఫీ చేస్తూ, రైతులకు ప్రభుత్వమే బీమా చేస్తూ, చివరకు పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు.
కేసీఆర్ వంటి సీఎం దేశంలోనే కాదు చరిత్రలో లేరన్నారు. 65లక్షల మంది రైతులకు 50వేల కోట్ల రైతు బంధు, 70వేల మంది రైతు కుటుంబాలకు 3,500 కోట్ల బీమా క్లెయిమ్ లు ఇస్తున్నామన్నారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ కింద ఏటా 10వేల కోట్లు, పంటల కొనుగోలు కోసం 30వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెంచి, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై 2లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఏకైక సీఎం కేసిఆర్ అన్నారు. సిఎం కేసిఆర్ హయాంలోనే రైతాంగానికి అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని తెలిపారు.