దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-12-30T01:18:17+05:30 IST
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు బంధును సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు బంధును సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ ఉచితంగా 24 గంటలు సరఫరా చేస్తున్నారని, రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారని, కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నారని ఆయన తెలిపారు. సకాలంలో ఎరువులు పంపిణి, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఒకప్రకటనలో తెలిపారు.
రైతు బంధు పథకం కింద 2018 వాన కాలం నుండి 2021 వాన కాలం వరకు రాష్ట్రంలో రైతులకు 43 వేల 36 కోట్ల 57 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం యాసంగి లో రైతు బంధు పథకం కింద 7 వేల 6 వందల 45 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. అందులో భాగంగా గత రెండు రోజుల్లో 18 వందల కోట్ల రూపాయలు 30 లక్షల 43 వేల 783 మంది రైతులకు పంపిణీ చేయబడ్డాయని ఆయన అన్నారు.
ఈ పథకం కింద మిగతా సహాయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. వీటన్నంటి ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని ఎర్రబెల్లి గుర్తు చేశారు.దేశంలో వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడంలేదని, కనీసం దరిదాపుల్లో కూడా లేదని మంత్రి దయాకర్ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం సంవత్సరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామన్నామని తెలిపారు.