ఆన్ లైన్ ఆడిటింగ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

ABN , First Publish Date - 2021-12-24T20:39:38+05:30 IST

ఇప్పటికే అభివృద్ధిలో దేశంలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటుంది.

ఆన్ లైన్ ఆడిటింగ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

హైదరాబాద్: ఇప్పటికే అభివృద్ధిలో దేశంలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటొంది.  రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ సైతం ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. తాజాగా గ్రామ పంచాయతీల ఆన్ లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది కూడా తెలంగాణ ఆన్ లైన్ ఆడిటింగ్ లో నెంబర్ వన్ గా నిలవడం విశేషం. అదే ఒరవడిని కొనసాగిస్తూ వరుసగా రెండో సారి కూడా తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ను అభినందిస్తూ లేఖ రాసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆన్ లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు ఆ లేఖలో అభినందించారు.


కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం విషయమై ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్ లైన్ లోనే  అందిస్తున్నది. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశం లో నెంబర్ వన్ గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతం తో తమిళనాడు, 60 శాతం తో ఆంధ్ర ప్రదేశ్ దేశ్, 59% తో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. 


మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసి  వెనుకబడ్డాయి.కాగా 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం పై నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలవడం విశేషం.ఇదిలా ఉండగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయి అని, దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాలు, మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ షిప్ మన పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాయని చెప్పారు. 


Updated Date - 2021-12-24T20:39:38+05:30 IST