వ‌రంగ‌ల్ లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ కి స్థ‌లాన్ని కేటాయించిన ప్ర‌భుత్వం

ABN , First Publish Date - 2021-10-18T20:29:48+05:30 IST

విద్యారంగంలో హైద‌రాబాద్ త‌ర్వాత ఉజ్వ‌లంగా, వ‌రంగ‌ల్ కి మ‌రో మ‌ణిమ‌కుటంగా కొన‌సాగుతున్న వ‌రంగ‌ల్ లోని హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ కి ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించింది.

వ‌రంగ‌ల్ లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ కి స్థ‌లాన్ని కేటాయించిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌: విద్యారంగంలో హైద‌రాబాద్ త‌ర్వాత ఉజ్వ‌లంగా, వ‌రంగ‌ల్ కి మ‌రో మ‌ణిమ‌కుటంగా కొన‌సాగుతున్న వ‌రంగ‌ల్ లోని హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ కి ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథ‌మిక స్థాయి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న చారిత్ర‌క నేప‌థ్యం క‌లిగి, ఎంద‌రినో అత్యున్న‌తులుగా తీర్చిదిద్దిన హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ వ‌రంగ‌ల్ లో గ‌త ఐదేళ్ళుగా అద్దె భ‌వ‌నంలో న‌డుస్త‌న్న‌ది. ప్ర‌భుత్వానికి అభ్య‌ర్థ‌న పంపిన హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీకి హ‌న్మ‌కొండ జిల్లా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం ఎలుకుర్తి గ్రామంలోని 50 ఎక‌రాల ప్ర‌భుత్వ‌ స్థ‌లాన్ని మార్కెట్ రేటుకు కేటాయిస్తూ జీవో నెంబ‌ర్ 93ని జారీ చేసింది. ఈ జీవోని ప్ర‌భుత్వం త‌ర‌పున రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి  ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేతుల మీదుగా, రాజ్య‌స‌భ స‌భ్యుల సురేశ్‌రెడ్డి స‌మ‌క్షంలో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ చైర్మ‌న్‌, ఉపాధ్య‌క్షుడు గుస్తీ జె. నోరియా హైద‌రాబాద్ లో మంత్రుల నివాసంలో  సోమ‌వారం స్వీక‌రించారు. 


అలాగే హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ వ‌రంగ‌ల్ కి రావ‌డానికి స‌హ‌క‌రించిన ప్ర‌భుత్వానికి, సీఎం కెసిఆర్ కి, విశేషంగా కృషి చేసిన మంత్రి ఎర్ర‌బెల్లికి, చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేశ్ కుమార్‌, హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతుల‌కు ఆ స్కూల్ సొసైటీ ఉపాధ్య‌క్షుడు నోరియా ధ‌న్య‌వాదాలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, 1923లో ఏడ‌వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బేగంపేట‌లో 122 ఎక‌రాల‌లో ఇండో సారాసెనిక్ ప‌ద్ధ‌తిలో నిర్మించిన విశాల‌మైన భ‌వ‌నాల‌లో జాగిర్దార్ కాలేజీగా ప్రారంభించారు. న‌వాబులు, జాగిర్దార్‌లు, ఉన్న‌త వ‌ర్గాల పిల్ల‌ల‌కు విద్య‌నందించేందుకు ఈ కాలేజీ ప‌ని చేసింది. నిజాం శ‌కం ముగిసిన త‌ర్వాత 1951లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ గాపేరు మార్చి సొసైటీ గ‌వ‌ర్నింగ్ బాడీ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తున్న‌ది.


హైద‌రాబాద్ లోని బేగంపేట‌, రామాంత‌పూర్, క‌డ‌ప త‌ర్వాత వ‌రంగ‌ల్ లోని మ‌రో బ్రాంచీ న‌డుస్తున్న‌ది. ఎంతో చారిత్ర‌క ప్రాధాన్యం క‌లిగిన హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌, చారిత్ర‌క వ‌రంగ‌ల్ కేంద్రానికి 5 ఏళ్ళ క్రిత‌మే రావ‌డం, దానికి ఈ రోజు స్థ‌లాన్ని కేటాయించ‌డం అత్యంత సంతోషించ‌ద‌గ్గ విష‌యం అన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ళ‌, ప్ర‌ఖ్యాత క్రికెట్ విశ్లేష‌కులు హ‌ర్షా భోగ్లే, విప్రో సిఇఓ కురియ‌న్‌, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి, హీరోలు నాగార్జున‌, రామ్ చ‌ర‌ణ్‌, రాణా, ప్ర‌స్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు  వంటి అనేక మంది హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ లోనే చ‌దివార‌ని మంత్రి వివ‌రించారు. వ‌రంగ‌ల్ లోనూ త్వ‌ర‌లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ ప్రారంభ‌మై మంచి విద్యాబుద్ధులు ఈ ప్రాంత విద్యార్థుల‌కు కూడా అందించి ఉన్న‌తులుగా తీర్చిదిద్దాల‌ని ఆకాంక్షించారు.

Updated Date - 2021-10-18T20:29:48+05:30 IST