మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తెస్తాం: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-05-06T20:15:12+05:30 IST

ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తీసుకు వస్తామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తెస్తాం: మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్: ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తీసుకు వస్తామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఇక్కడి చెరువులు నింపి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నిమంత్రి ఆవిష్కరించారు.అలాగే రూ.16 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.40లక్షలతో సిసి రోడ్లు, రూ.20లక్షలతో డ్రైనేజీలకు ప్రారంభోత్స‌వం చేశారు. రూ.4కోట్ల 56 లక్షలతో చేపట్టిన పోలేపల్లి నుండి చంద్రు తండ వరకు బిటి రోడ్డు, రూ.60 లక్షలతో తాన్య తండా కు బిటి రోడ్డు, రూ.14లక్షల 94 వేలతో మన ఊరు మన బడి కార్యక్రమాల శంకుస్థాపనలు చేశారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇక్కడి పేదలకు అందజేసినట్టు తెలిపారు.ప్రతి ఇంటికీ ఏదో ఒకటి, అంతకు మించి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,ఆరోగ్య లక్ష్మి, 102 వాహనం, ప్రభుత్వ దవాఖానా లో ఉచిత సాధారణ ప్రసూతి, కేసిఆర్ కిట్లు, పెన్షన్లు, మిషన్ భగీరథ మంచినీరు, రైతు బంధు, రైతు బీమా, మన ఊరు మన బడి ఇలా చెప్పలేనన్ని పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. అంతే కాదు వచ్చే నెల నుంచే 57 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేస్తామన్నారు.


తొర్రూరు మండలం లోనే మడిపల్లి కి అత్యధికంగా 10 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ లు వంటి స్కీం లు ఇచ్చామన్నారు.మడిపల్లి లో 2 కోట్ల 60 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చి నియోజక వర్గం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేలా అవకాశం కల్పించారన్నారు.మడిపల్లి ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంల స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read more