తాను చెప్పింది ఆచరించిన మహామనిషి జ్యోతిబాపూలే: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-11T22:12:52+05:30 IST

గొప్ప సామాజిక వేత్తగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహామనిషి జ్యోతిబాపూలే అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు.

తాను చెప్పింది ఆచరించిన మహామనిషి జ్యోతిబాపూలే: మంత్రి ఎర్రబెల్లి

న్యూఢిల్లీ: గొప్ప సామాజిక వేత్తగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహామనిషి జ్యోతిబాపూలే అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సంఘసేవకుడిగా కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు జ్యోతిబాపూలే అన్నారు.తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి అని,సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడని అన్నారు. 


అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు.ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు.ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారికి కూడా విద్యా బోధిన చేశారని అన్నారు.1864లో "బాలహత్య ప్రతిబంధక్ గృహ" స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి.సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్ట మొదటి సంస్కరణోద్యమం.సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజం ఉండాలన్న గొప్ప వ్యక్తి జ్యోతిబాపూలే అన్నారు. 


నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కూడా ఆయన  కాదన్నాడు.సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేశారని చెప్పారు.మహాత్మా ఫూలే ఆలోచన విధానం స్పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని,సీఎం కేసిఆర్ కుల వృత్తులకు సామాజిక గౌరవం కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-11T22:12:52+05:30 IST