తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-03-06T00:38:12+05:30 IST

నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ నల్గొండ లో పద్మనాయక వెలమ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎర్రబెల్లి

నల్గొండ: నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ నల్గొండ లో పద్మనాయక వెలమ  పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. అతిథులుగా ఆల్ ఇండియా వెలమ సంఘం అధ్యక్షుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ కానిపర్తి భాను ప్రసాద్ రావు, మాజీ ఎంఎల్ఏ వేనే పల్లి చందర్ రావ్, సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు  తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. 24గంటల కరెంటు, సాగు నీరు, ఎదురు పెట్టుబడిగా రైతు బంధు, రైతు భీమా ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? రైతుల పంటలను కొనుగోలు చేసి, పెన్షన్లు ఇస్తూ, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనుడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ను విమర్శించేవారు ఈ విషయాలను గమనించుకోవాలన్నారు.


రాష్టంలో 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. 100 రోజుల్లో నల్లధనం వచ్చిందా? మన ఖాతాల్లో 15లక్షలు పడ్డాయా? యూపీ, గుజరాత్ లో భూములు ఇవ్వకున్నా, కోచ్ ఫ్యాక్టరీ లు ఇచ్చారు. 150.05 ఎకరాల భూమి ఇచ్చినా ఇవ్వలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదు. పోనీ రాష్ట్రంలో 4 గురు ఎంపీ లున్న నియోజకవర్గాల్లో కూడా ఏమీ సాధించలేక పోయిన దద్దమ్మలు ఏవేవో మాట్లాడుతున్నారు. సీఎం ని ఎవరైనా నిలదీస్తే, ఊరుకోవద్దు. నిలదీయాలి. మనమంతా ఏకగ్రీవంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కి పూర్తి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించి సీఎం కెసిఆర్కి కానుకగా ఇద్దాం అన్నారు.

Updated Date - 2021-03-06T00:38:12+05:30 IST