యడియూరప్ప మార్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి

ABN , First Publish Date - 2020-09-16T13:44:21+05:30 IST

రాష్ట్రంలో బీఎస్‌ యడియూరప్ప నాయకత్వ మార్పు ఎట్టి పరిస్ధితిలోనూ సాధ్యంకాదని, మిగిలిన మూడేళ్లూ ఆయనే సీఎంగా కొనసాగనున్నారని రెవిన్యూశాఖ మంత్రి

యడియూరప్ప మార్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఎస్‌ యడియూరప్ప నాయకత్వ మార్పు ఎట్టి పరిస్ధితిలోనూ సాధ్యంకాదని, మిగిలిన మూడేళ్లూ ఆయనే సీఎంగా కొనసాగనున్నారని రెవిన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ తేల్చిచెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు కేవలం ఊహాగానమేనని ఆయన కొ ట్టిపారేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే రాజకీయ చాణక్యం యడియూరప్ప సొంతమన్నారు. ఏ బంతిని విసిరినా దాన్ని సిక్సర్‌ వైపునకు పంపే సత్తా ఆయనకు ఉందన్నారు. అధిష్ఠానం ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు బీజేపీ నేతలను దువ్వుతోందన్న కథనాలను ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలపై తాను స్పందించబోనన్నారు. ఏడుపదుల వయసు దాటినా యడియూరప్ప చాలా చలాకీగా పనిచేస్తున్నారని మంత్రి అశోక్‌ ప్రశంసలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీకి గట్టి పునాదులు వేయడమే కాకుండా దక్షిణాదిన తొలిసారి కమల వికాసానికి రాచబాటలు వేసిన ఘనత యడియూరప్పదేనన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉండవచ్చునని, విచారణలో అన్నివిషయాలు తేటతెల్లం అవుతాయన్నారు. డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నటుడితో తాను ఫొటో దిగడాన్ని కొందరు నానా యాగీ చేస్తున్నారని ఇది సరికాదని మంత్రి అన్నారు. ప్రజాజీవితంలో ఇలాంటివి సర్వసాధారణమన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో దోషులుగా తేలేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలోని డీమ్డ్‌ ఫారెస్ట్‌ పరిధిలోకి వచ్చే 9.50 లక్షల హెక్టార్ల ప్రదేశంలో 6 లక్షల హెక్టార్లను మినహాయించి రెవెన్యూ శాఖ పరిధిలోకి తీసుకుని రావాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మీడియాకు చెప్పారు. దీని వల్ల ఈ పంటపొలాలను ప్రస్తుతం  సాగుచేస్తున్న రైతులకు ఎంతో ప్రయోజనం దక్కుతుందని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-09-16T13:44:21+05:30 IST