Covid కేసులు పెరిగితే విద్యాసంస్థలు మూసివేస్తాం

ABN , First Publish Date - 2021-12-07T17:56:41+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరిగితే విద్యాసంస్థలను మూసివేస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్‌ వెల్లడించారు. సోమవారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి కొవిడ్‌ రాష్ట్రంలో అదుపులోనే

Covid కేసులు పెరిగితే విద్యాసంస్థలు మూసివేస్తాం

                  - విద్యాశాఖ మంత్రి నాగేష్‌ 


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరిగితే విద్యాసంస్థలను మూసివేస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్‌ వెల్లడించారు. సోమవారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి కొవిడ్‌ రాష్ట్రంలో అదుపులోనే ఉందని ఒక వేళ తీవ్రరూపంగా మారితే వెంటనే విద్యాసంస్థలను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంతకుమించిన పరిణామాలు జరిగితే పరీక్షల నిర్వహణపైనా ఆలోచిస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండటం కొంచెం ఆందోళనకరమే అన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు నమోదవుతున్నది రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలోనే అన్నారు. 1-10 తరగతులకు సంబంధించిన పాఠశాలలో కేసులు నమోదు కాలేదన్నారు. హాస్టళ్లు, నవోదయ విద్యాలయాలలో వైరస్‌ ప్రబలిన మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది కలుగలేదన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులకు వైరస్‌ సోకినా సమస్య కాలేదని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోసారి అధికారులతో చర్చించి కొవిడ్‌ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తామన్నారు. ఒకటి రెండు రోజులలోనే వైరస్‌ ప్రబలిన నవోదయ విద్యాలయతో పాటు హాస్టళ్లను స్వయంగా పరిశీలించేందుకు వెళతానన్నారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఎస్‌ఓపీ అమలును జిల్లా అధికారులు పరిశీలించేలా ఆదేశించామన్నారు. ప్రస్తుతానికి నిపుణులు అందించిన నివేదిక ప్రకారం ఎటువంటి సమస్య లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విద్యాసంస్థలలో కొవిడ్‌ నిబంధనలు కఠినంగా పాటించేలా ఆదేశించామన్నారు. ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో కొవిడ్‌ పెరిగే అవకాశం ఉందని అందుకే ప్రతి కోణంలోను ప్రభుత్వం నిఘా పెట్టిందన్నారు.

Updated Date - 2021-12-07T17:56:41+05:30 IST