అశోక్ గజపతిరాజు చెప్పింది శుద్ధ అబద్ధం: మంత్రి బొత్స
ABN , First Publish Date - 2021-12-23T18:58:17+05:30 IST
రామతీర్థం ఆలయానికి శంకుస్థాపన చేసే ముందు పద్ధతి ప్రకారం అందరిని పిలవడం జరిగిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
విజయనగరం: రామతీర్థం ఆలయానికి శంకుస్థాపన చేసే ముందు పద్ధతి ప్రకారం అందరిని పిలవడం జరిగిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ..‘‘అశోక్ గజపతిరాజు చెప్పింది శుద్ధ అబద్ధం. ఆహ్వానం అందించడానికి ఈఓ, ఆలయ అర్చకులు వెళ్లారు.. వారిపై అశోక్ గజపతిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శంకుస్థాపన గంట ముందు వెళ్లి శిలాఫలకాన్నీ విసిరివేయాలని చూశారు. అక్కడ ఉన్న సర్పంచ్, ఎమ్మెల్సీని అశోక్ గజపతిరాజు అడ్డుకున్నారు. అడ్డుకున్న అధికారులను అశోక్ గజపతి దుర్బాషలాడారు. బోర్డులో ఆయన పేరు ఉంది లేదనటం అవాస్తవం. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు జులుం చేశామనడం శోచనీయం.బాధ్యత గల వ్యక్తులు పద్ధతిగా వ్యవహరించాలి. మంత్రిపై కూడా దుర్బాషలాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే హక్కులు వాళ్లకి ఉంటాయి. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. అశోక్ గజపతిరాజు బాధ్యత లేకుండా అసభ్యంగా ప్రవర్తించారు. నేను నిన్న అన్న మాటలకు కట్టుబడి ఉన్నా. ఇదేనా మీ పెంపకం.. ఇదేనా సంస్కారం అన్న మాటలకు కట్టుబడి ఉన్నా. ప్రతి దేవస్థానం దగ్గర శిలాఫలకాలు ఉంటాయి’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అశోక్ గజపతిరాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.