ఢిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తాడు: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2021-10-23T22:55:05+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఢిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తాడు: మంత్రి బాలినేని

ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏం ఫిర్యాదు చేస్తాడని మంత్రి బాలినేని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడో అర్థం కావటం లేదన్నారు. బూతులు తిట్టారని ఫిర్యాదు చేస్తారా, ఆఫీస్ పగులగొట్టారని ఫిర్యాదు చేస్తారా అని ఆయన నిలదీసారు. టీడీపీ పార్టీ కార్యాలయాన్ని తమ దేవాలయం అంటాడని,   మరి అలాంటి పార్టీని ప్రారంభించిన దేవుడు ఎన్టీఆర్‌ను చంద్రబాబు చెప్పులతో కొట్టించాడని ఆయన విమర్శించారు. ఆయన ఢిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తాడన్నారు. టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చరిత్ర చెబుతుంటే తమకు వింటుంటే అసహ్యం వేస్తుందన్నారు. పనీ, పాటా లేదు కాబట్టే జూమ్ మీటింగ్‌లు పెట్టుకుంటు కూర్చున్నాడన్నారు. ఢిల్లీలో ఆయనను పలకరించేవాడు, స్పందించేవాడు లేడన్నారు.


అమిత్ షాపై కూడా రాళ్లు వేయిస్తే ఆయనెలా అపాయింట్మెంట్ ఇస్తాడని ఆయన ప్రశ్నించారు. ఎవరేది ఇచ్చినా చేసేదేమీ లేదని, చేయించుకునేదేమీ లేదన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం టీడీపీ కార్యాలయంపై ఆయనే దాడి చేయించుకుని ఉంటాడని తమ అనుమానమన్నారు. వాళ్లే చేసుకుని వాళ్లే కేసులు పెట్టుకుంటున్నారన్నారు. రాష్ట్రానికే సీబీఐ రావటానికి వీల్లేదని చెప్పిన వ్యక్తి ఈరోజు సీబీఐ దర్యాప్తు ఎలా కోరతాడని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ఒక నీతి, మరొకరికి మరో నీతా అని ఆయన నిలదీసారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మరోసారి చంద్రబాబుకు బుద్ది చెబుతారని మంత్రి బాలినేని అన్నారు. 


Updated Date - 2021-10-23T22:55:05+05:30 IST