‘విజయసాయి రెడ్డిపై హత్యాయత్నం చేశారు’
ABN , First Publish Date - 2021-01-21T15:51:51+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు రామతీర్థం ఘటనను కూడా రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు రామతీర్థం ఘటనను కూడా రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో దాడి చేసిన సంస్కృతి లేదని... తెలుగుదేశం పార్టీ నేతలు తీసుకువచ్చారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి మీద హత్యాయత్నం చేశారని.. ఆటవికంగా, పాశవికంగా దాడి చేశారని మండిపడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని మంత్రి చెప్పుకొచ్చారు. ఆయన మీద దాడి చేసే విధంగా వ్యవహారశైలి ఉందని పోలీసులు అరెస్టు చేశారన్నారు. పోలీసులు ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రతీ రోజు ఒక రాజకీయ కార్యక్రమం ఉండాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలు చేస్తుంటే మంచి పేరు వస్తుందని ఈ నిరసనకు దిగారని మండిపడ్డారు. చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు.