‘నైస్‌’కు ఇచ్చిన అదనపు భూమిని వెనక్కి తీసుకుంటాం

ABN , First Publish Date - 2022-04-27T16:45:18+05:30 IST

నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ (నైస్‌) సంస్థకు గతంలో ఇచ్చిన అదనపు భూమిని స్వాధీనం చేసుకునేందుకు మంత్రి మండలి ఉప సమితి ఆమోద ముద్రవేసింది. ఈ విషయాన్ని

‘నైస్‌’కు ఇచ్చిన అదనపు భూమిని వెనక్కి తీసుకుంటాం

                                          - మంత్రి ఆర్‌ అశోక్‌ వెల్లడి


బెంగళూరు: నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ (నైస్‌) సంస్థకు గతంలో ఇచ్చిన అదనపు భూమిని స్వాధీనం చేసుకునేందుకు మంత్రి మండలి ఉప సమితి ఆమోద ముద్రవేసింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ నగరంలో మంగళవారం మీడియాకు చెప్పారు. వచ్చే అక్టోబరు, నవంబరు నాటికి ఈ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. నైస్‌ రోడ్డు పెద్ద సమస్యగా పరిణమించిందని, గత ప్రభుత్వాల హయాంలో నైస్‌ రహదారికి అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చారని మంత్రి చెప్పారు. ఈ రోడ్డు వల్ల నగర ప్రజలకు ప్రయోజనం సంగతేమో గానీ భారం అధికమైందని మంత్రి వ్యాఖ్యానించారు.  నైస్‌ రహదారి నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయన్నారు. నైస్‌ సంస్థకు అదనంగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన 543 ఎకరాల భూమిని తిరిగి చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచన చేశామన్నారు. నైస్‌ కంపెనీ సుమారు 1600 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని చట్టవ్యతిరేకంగా టౌన్‌షి్‌ప నిర్మాణం చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఈ భూస్వాధీన ప్రక్రియలో భూములిచ్చిన రైతులకు ఎకరానికి రూ. 1.60 కోట్ల తో పాటు 2,400 చదరపు అడుగుల ఇంటి స్థలం ఇవ్వాల్సి ఉండగా 20 సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. గతంలో మాజీమంత్రి టీబీ జయచంద్ర నాయకత్వంలోని సభాసంఘం నివేదికలోని అంశాలను కూడా పరిశీలించి నైస్‌ అక్రమాలకు తెరదించుతామని తద్వారా రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తామని మంత్రి అశోక్‌ వివరించారు.

Updated Date - 2022-04-27T16:45:18+05:30 IST