గేటు గడ్డర్ విరిగిపోవటం వల్లే..
ABN , First Publish Date - 2021-08-06T06:29:08+05:30 IST
గేటు గడ్డర్ విరిగిపోవటం వల్లే..
పులిచింత లను సందర్శించిన మంత్రులు
జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 5 : పులిచింతల ప్రాజెక్టు గేటు ఎత్తే సమయంలో గడ్డర్ విరిగి పడిపోవటం వల్లే ప్రమాదం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ వివరణ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టును గురువారం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, కలెక్టర్ నివాస్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గేటుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకు అన్ని గేట్లూ తెరిచి నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని సాంకేతిక నిపుణులను ఆదేశించామని తెలిపారు. కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ పులిచింతల నుంచి నీటిని విడుదల చేయటం వల్ల ఏర్పడే ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు పునరావాస చర్యలు చేపట్టామని చెప్పారు. ఆ తర్వాత మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.