అంతా పారదర్శకం
ABN , First Publish Date - 2020-07-05T08:49:33+05:30 IST
పేద ప్రజలందరికీ ఆరోగ్య హక్కు కల్పించే కార్యక్రమాల్లో భాగంగా 108, 104 అంబులెన్సుల కొనుగోలు, నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని
- ఏడాదికి రూ.185 కోట్లు ఆదా
- అంబులెన్సులపై ఆళ్ల నాని
విజయవాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): పేద ప్రజలందరికీ ఆరోగ్య హక్కు కల్పించే కార్యక్రమాల్లో భాగంగా 108, 104 అంబులెన్సుల కొనుగోలు, నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో ఇంగిత జ్ఞానం లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. శనివారం ఆయన విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో విలేకరులతో మాట్లాడారు. అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి మొత్తంగా ఏడాదికి సుమారు రూ.185 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూశామన్నారు. ఉద్యోగులకు సంబంధించి 108, 104 వాహనాల్లో పని చేసే పైలట్లకు, ఎమర్జెన్సీ సాంకేతిక నిపుణులకు చెల్లించే జీతభత్యాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. రాబోయే ఏడేళ్లలో వాహన నిర్వహణ, ఆయిల్ చార్జీలు, సిబ్బంది జీతభత్యాలతో సంబంధం లేకుండా కొనసాగించేలాగా ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు.