రాష్ట్రంలో మినీ రైతుబజార్లు

ABN , First Publish Date - 2022-01-15T08:34:30+05:30 IST

ఒమైక్రాన్‌, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైతుబజార్లను

రాష్ట్రంలో మినీ రైతుబజార్లు

  • రద్దీ ప్రాంతాల్లో ఉన్న వాటి వికేంద్రీకరణ
  • కరోనా కట్టడికేనన్న మార్కెటింగ్‌ అధికారులు


అమరావతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఒమైక్రాన్‌, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైతుబజార్లను వికేంద్రీకరించాలని మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే వసతి సౌకర్యాలు ఉన్నచోట మాత్రమే వికేంద్రీకరించనున్నారు. పట్టణాల్లో ఇరుకుగా ఉన్న రైతుబజార్లలో నిత్యం రద్దీ నెలకొంటోంది. దీంతో ఇవి కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి రైతుబజార్లను గుర్తించి, వాటిని విభజించి, అవకాశం ఉన్న చోట మినీ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యలో మినీ రైతుబజార్ల ఏర్పాటుకు తగిన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు మార్కెటింగ్‌ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.


2020లో పూర్తి లాక్‌డౌన్‌ పెట్టినప్పుడు పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు మూతపడడంతో వాటిని మినీ రైతు బజార్లుగా మార్చి వినియోగించుకున్నారు. అయితే ఇప్పుడు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథాతథంగా నడుస్తున్నందున రైతుబజార్ల వికేంద్రీకరణకు తగిన స్థలం లభించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కూడలి ప్రాంతాలు, లేదా ఏదైనా ప్రభుత్వ స్థలాలు, భవనాలు ఖాళీగా ఉన్న చోట మినీ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతు బజార్లలో రద్దీని తగ్గించడం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని జేసీలకు సూచించినట్లు మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.  


Updated Date - 2022-01-15T08:34:30+05:30 IST