రూపాయికే బిందె మినరల్ వాటర్.. కొత్త పథకానికి శ్రీకారం
ABN , First Publish Date - 2020-02-18T15:50:10+05:30 IST
పలు ప్రాంతాల్లో ప్రాథమిక పనులు ప్రారంభించిన నేపథ్యంలో..
చెన్నై : పూర్వ విద్యార్థుల కృషి, సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శుద్ధీకరించిన తాగునీటి పథకాన్ని పుదుక్కోట జిల్లాలోని ఏంబల్ గ్రామంలో ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కమిటీ ప్రణాళిక కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1580 తాగునీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. తొలివిడతగా పుదుక్కోట జిల్లాలో ఈ పథకం నిమిత్తం 64 ప్రాంతాలను ఎంపిక చేసే పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రాథమిక పనులు ప్రారంభించిన నేపథ్యంలో.. అరిమళం సమీపంలో వున్న ఏంబల్ గ్రామంలో రూ.8లక్షల వ్యయంతో తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
ఏంబల్ గ్రామంలోని పూర్వ విద్యార్థులు ఈ ప్లాంట్ ఏర్పాటుకు చాలా కృషి చేశారు. ఇక్కడున్న ఓవర్హెడ్ ట్యాంక్ సమీపంలోనే తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటైంది. ఓవర్హెడ్ ట్యాంకు నుంచి నీటిని శుద్ధీకరణ కేంద్రాన్ని తరలించి ప్రజలకు వినియోగిస్తున్నారు. ఒక గంటలకు వెయ్యి లీటర్ల చొప్పున శుద్ధీకరించిన నీటిని రోజుకి 12వేల లీటర్ల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ యంత్రంలో ఒక రూపాయి నాణాన్ని వేసి కొన్ని సెకన్లలో 20 లీటర్ల (ఒక బిందె) నీటిని పొందవచ్చు. 20 లీటర్లు సరఫరా అయిన వెంటనే యంత్రం నుండి నీటి రాక ఆగిపోతుంది. మళ్లీ రూపాయి నాణెం వేస్తే నీరు వస్తుంది. ఈ శుద్ధీకరించిన తాగునీరు శుభ్రంగా వుండడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.