న్యాయ వ్యవస్థ మనసు ప్రజలకు అలా తెలుస్తుంది : సీజేఐ

ABN , First Publish Date - 2021-11-15T01:49:06+05:30 IST

ట్రయల్ కోర్టులు, జిల్లా న్యాయ వ్యవస్థ చర్యల

న్యాయ వ్యవస్థ మనసు ప్రజలకు అలా తెలుస్తుంది : సీజేఐ

న్యూఢిల్లీ : ట్రయల్ కోర్టులు, జిల్లా న్యాయ వ్యవస్థ చర్యల ద్వారా భారత దేశ న్యాయ వ్యవస్థ మనసు లక్షలాది మంది ప్రజలకు తెలుస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతలను అన్ని స్థాయుల్లోనూ పరిరక్షించడం, కాపాడటం, ప్రోత్సహించడం కన్నా ముఖ్యమైనది వేరొకటి లేదన్నారు. సంక్షేమ రాజ్యానికి రూపునివ్వడంలో మన న్యాయ వ్యవస్థ ముందు వరుసలో ఉందని, సాంఘిక ప్రజాస్వామ్యం వృద్ధి చెందడానికి రాజ్యాంగ న్యాయస్థానాల తీర్పులు దోహదపడుతున్నాయని చెప్పారు. 


నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) సహకారంతో నిర్వహించిన లీగల్ అవేర్‌నెస్ కాంపెయిన్‌ ముగింపు సమావేశంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ, మనం సంక్షేమ రాజ్యంలో ఉన్నప్పటికీ, కోరుకున్నంత స్థాయిలో అర్హులకు ప్రయోజనాలు చేరడం లేదన్నారు. గౌరవప్రదంగా జీవించాలనుకునేవారికి పెను సవాళ్ళు ఎదురవుతున్నాయని, దీనికి ప్రధాన కారణం పేదరికమని చెప్పారు. ట్రయల్ కోర్టులు, జిల్లా న్యాయ వ్యవస్థ చర్యల ద్వారా భారత దేశ న్యాయ వ్యవస్థ మనసు లక్షలాది మంది ప్రజలకు తెలుస్తుందన్నారు. కక్షిదారుల్లో అత్యధికులకు కనిపించేది జిల్లా న్యాయ వ్యవస్థేనన్నారు. క్షేత్ర స్థాయిలో న్యాయాన్ని అందజేసే వ్యవస్థ పటిష్టంగా లేకపోతే, ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థను ఊహించుకోలేమని చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతలను అన్ని స్థాయుల్లోనూ పరిరక్షించడం, కాపాడటం, ప్రోత్సహించడం కన్నా ముఖ్యమైనది వేరొకటి లేదన్నారు. 


ఈ కార్యక్రమంలో వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీలు పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత నాన్ వర్చువల్ మోడ్‌లో జరిగిన సమావేశంలో జస్టిస్ రమణ పాల్గొనడం ఇదే తొలిసారి. 


Updated Date - 2021-11-15T01:49:06+05:30 IST