అలా అయితేనే!

ABN , First Publish Date - 2021-02-25T06:29:31+05:30 IST

గత ఏడాది మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంలో పార్టీ తరఫున టిక్కెట్‌ ఆశించి అవకాశం దక్కక నామినేషన్లు వేసిన రెబల్‌ అభ్యర్థుల్లో పలువురు బుజ్జగింపుల కోసం ఎదురు చూస్తున్నారు.

అలా అయితేనే!

 ఏడాది కిందట మునిసిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు

టికెట్‌ దక్కని రెబెల్‌ అభ్యర్థులు..

ఉపసంహరణకు పలు షరతులు

హామీ ఇవ్వాలని డిమాండ్‌! 

మునిసిపాలిటీల్లో రసవత్తర రాజకీయం

 

గుంటూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంలో పార్టీ తరఫున టిక్కెట్‌ ఆశించి అవకాశం దక్కక నామినేషన్లు వేసిన రెబల్‌ అభ్యర్థుల్లో పలువురు బుజ్జగింపుల కోసం ఎదురు చూస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ మరో  వారం రోజుల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ఈ లోపు నాయకులు తమ వద్దకు వచ్చో, పిలిపించో మాట్లాడి హామీలు ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు తమని పిలిస్తే ఇప్పటివరకు పెట్టిన ఖర్చుతో పాటు పార్టీ గెలిస్తే ఫలాన పదవి ఇస్తామన్న హామీని తీసుకోవాలని ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం తమ అనుచరులతో సమావేశాలు, చిన్న కార్యాలయాల ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ నాయకుల కళ్లల్లో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. 

పోటీగా రాజకీయం

మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తేదీ వచ్చే నెల 3 కావడంతో గుంటూరు నగరపాలకసంస్థతో పాటు ఎలక్షన్లు జరగబోతున్న మునిసిపాలిటీల్లో రెబల్‌ అభ్యర్థులుగా ఉన్న వారిలో కొందరు పార్టీ టిక్కెట్‌ ఖరారు చేసిన అభ్యర్థులను ఉడికిస్తున్నారు. వైసీపీ, టీడీపీ తరఫున పలు వార్డుల్లో రెబల్స్‌ ఉన్నారు. ఇప్పటికే టిక్కెట్‌ ఖరారైన అభ్యర్థులు తమ వార్డుల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రెబల్స్‌ కూడా వారికి పోటీగా రాజకీయం నడుపుతున్నారు. ఇక ఎలాగూ తమకు పార్టీ టిక్కెట్‌ ఖరారు చేయదనే నిర్ణయానికి వచ్చిన కొందరు నామినేషన్‌ ఉపసంహరించుకొనేందుకు కొన్ని డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. 


పలు డిమాండ్లతో..

డిమాండ్లలో ప్రధానంగా ఇప్పటివరకు తాము పెట్టిన ఖర్చుని ప్రస్తావిస్తున్నారు. గత ఏడాది పెట్టిన ఖర్చు, వార్డులో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు అయిన మొత్తాన్ని లెక్కలతో సహా నాయకులకు నివేదించి ఆ మొత్తాన్ని పార్టీ అధికారిక అభ్యర్థి నుంచి ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. అలానే తమకు కో-ఆప్షన్‌ మెంబర్‌/పార్టీలో కీలక పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇకపై ఏ కార్యక్రమానికి అయినా పార్టీ అభ్యర్థి తమని ముందుగా కలుపుకొని పోవాలని షరతు పెడుతున్నారు. తమకు ప్రత్యర్థి పార్టీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని కూడా చెబుతున్నారు. దీంతో వారిని బుజ్జగించడం నాయకులకు తలనొప్పిగా మారింది. కాగా మునిసిపల్‌ ఎన్నికలు ఈ దఫా పోటాపోటీగా జరిగే వాతావరణం నెలకొంది. దీంతో ప్రతీ ఓటు కీలకం కావడంతో రెబెల్‌ అభ్యర్థులు కొన్ని చీల్చినా నష్టం జరుగుతుంది. దీంతో నాయకులు ఆచితూచీగా స్పందిస్తున్నారు. 

Updated Date - 2021-02-25T06:29:31+05:30 IST