మిల్కా భార్య కన్నుమూత

ABN , First Publish Date - 2021-06-14T09:50:58+05:30 IST

భారత అథ్లెటిక్‌ దిగ్గజం మిల్కాసింగ్‌ (91) కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

మిల్కా భార్య కన్నుమూత

కొవిడ్‌ చికిత్స పొందుతూ నిర్మల్‌ కౌర్‌ మృతి

ఇంకా ఐసీయూలోనే అథ్లెటిక్స్‌ దిగ్గజం


చండీగఢ్‌: భారత అథ్లెటిక్‌ దిగ్గజం మిల్కాసింగ్‌ (91) కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య, భారత మహిళల వాలీబాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ నిర్మల్‌ కౌర్‌ కరోనా కారణంగా మృతి చెందారు. గత నెలాఖరులో మిల్కా కొవిడ్‌ బారిన పడగా.. ఆ తర్వాత రెండ్రోజులకు 85 ఏళ్ల నిర్మల్‌ కౌర్‌ కూడా పాజిటివ్‌గా తేలారు. అప్పటినుంచి మొహాలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె .. ఆదివారం ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.


నిర్మల్‌కు భర్త మిల్కా, ఓ కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా.. మిల్కా కూడా కొవిడ్‌కు చికిత్స తీసుకుంటూ ఇక్కడి ఆసుపత్రి ఐసీయూలో ఉండడంతో.. అతను భార్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడం మరింత విషాదకరం. గతంలో జాతీయ వాలీబాల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన నిర్మల్‌ కౌర్‌.. పంజాబ్‌ రాష్ట్ర మహిళల క్రీడాశాఖ డైరెక్టర్‌గా కొనసాగారు. మిల్కా దంపతుల కుమారుడు జీవ్‌ మిల్కాసింగ్‌ అంతర్జాతీయ గోల్ఫర్‌. 

Updated Date - 2021-06-14T09:50:58+05:30 IST