వైభవంగా మిలాద్-ఉన్-నబీ
ABN , First Publish Date - 2021-10-20T04:22:45+05:30 IST
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ముస్లింలు మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు.
ఉదయగిరి(ఉదయగిరి రూరల్), అక్టోబరు 19: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ముస్లింలు మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. మండలంలోని బిజ్జంపల్లి, గండిపాళెం, వెంగళరావునగర్, దాసరిపల్లి మసీదులతోపాటు ఉదయగిరి పట్టణంలోని చిన్న, పెద్ద మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి జిలేబీలు పంచిపెట్టారు. ఇమామ్లు దైవ సందేశాన్ని ఇచ్చారు. సాయంత్రం జెండా ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. స్థానిక కోనకాలువ సమీపంలోని అబీద్బాబా దర్గాలో పేదలకు అన్నదానం చేశారు. ఖురాన్, మిలాద్ పఠనం గావించి ప్రత్యేక ప్రార్థనల అనంతరం జిలేబీలు పంచిపెట్టారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు, చిల్డ్రన్ హోమ్లోని చిన్నారులకు ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్లు, సీతలపానియాలు పంపిణీ చేశారు.
ఘనంగా ఆసారేఖద్వే ముబారక్ : మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని హజరత్ మహాత్ సల్లెల్లాహు అసత్, ఖద్వేముబారక్ పవిత్ర పాదచిహ్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హక్కుదారుల ఇంటి నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మహమ్మద్ ప్రవక్త అవశేషాలను పెద్ద, చిన్న మసీదుల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మిలాద్ ఉన్ నబీ వేడుకలు
కావలిటౌన్, అక్టోబరు 19: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ట్రంకురోడ్డులోని దర్గా మసీదు వద్ద నసీర్ ఆధ్వర్యంలో జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.