దుబాయిలో ప్రవాసీ కార్మికుల ఆకలి కేకలు
ABN , First Publish Date - 2022-07-04T09:33:54+05:30 IST
ఎడారి దేశంలో వేతనాలు అందక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రవాసీలకు తెలుగు అసోసియేషన్ అండగా నిలిచింది.
ఆహార సామగ్రి అందించిన తెలుగు అసోసియేషన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ప్రతినిధి: ఎడారి దేశంలో వేతనాలు అందక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రవాసీలకు తెలుగు అసోసియేషన్ అండగా నిలిచింది. యూఏఈలోని ఫుజిరా నగరంలో ఉన్న ఒక క్వారీ సంస్థలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారితో పాటు 20 మంది బారతీయ ప్రవాసీలు చాలా కాలంగా పనిచేస్తున్నారు. సంవత్సరం కాలంగా వారికి సంస్థ వేతనాలు చెల్లించడంలేదు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనుకొన్న ఆ కార్మికులకు గ్రాట్యుటీ, బకాయి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. తినడానికి తిండి లేక అలమటిస్తున్న వారి దుస్థితి గురించి భారతీయ కాన్సులేట్ ద్వారా తెలుసుకున్న దుబాయిలోని తెలుగు అసోసియేషన్.. బాధితులకు తోచినంత సాయం చేసింది. అసోసియేషన్కు చెందిన సాయికృష్ణ, చైతన్య, భీంశంకర్, ఫహీం, సాయి ప్రకాశ్, విజయభాస్కర్ తదితరులు ఫుజిరాకు వెళ్లి.. పస్తులుంటున్న కార్మికులకు నెలరోజులకు సరిపడ ఆహార సామగ్రి, ఇతర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులను దుబాయిలోని భారతీయ కాన్సులేట్ అధికారిణి తాడు మాము అభినందించారు. గతంలోనూ ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసీలకు ఈ సంఘం సహాయక కార్యక్రమాలు చేపట్టింది.