యజమాని ఉదారత: రూ. 68 వేలతో వలస కూలీలకు విమాన టిక్కెట్లు!
ABN , First Publish Date - 2020-05-28T15:30:14+05:30 IST
నేను విమానంలో కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా యజమాని మాకు విమానం టిక్కెట్లు కొని ఇచ్చారు.... అని ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న వలస కూలీలు ఐజిఐ విమానాశ్రయంలో తెలిపారు.
న్యూఢిల్లీ: నేను విమానంలో కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా యజమాని మాకు విమానం టిక్కెట్లు కొని ఇచ్చారు.... అని ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న వలస కూలీలు ఐజిఐ విమానాశ్రయంలో తెలిపారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపధ్యంలో పలువురు యజమానులు వలస కార్మికుల పాలిట జీతాలు ఇవ్వకండా కఠినంగా వ్యవహరించారనే వార్తలు విన్నాం. అయితే ఈ పదిమంది వలస కూలీల యజమాని పప్పన్ గహ్లాట్ వీరి పాలిట దేముడయ్యాడు. పప్పన్ తన సొంత డబ్బుతో వీరికోసం విమాన టికెట్లు కొని స్వస్థలాలకు పంపించారు. ఇందుకోసం అతనికి 68 వేల రూపాయలు ఖర్చయ్యాయి. పప్పన్ గత 20 సంవత్సరాలుగా పుట్టగొడుగుల వ్యాపారం సాగిస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా అతని దగ్గర పనిచే పదిమంది వలస కూలీలు తమ స్వగ్రామానికి వెళ్లాలని భావించారు. అయితే వారి దగ్గర డబ్బులేకపోవడంతో ఈ విషయాన్ని యజమానికి తెలిపారు. దీంతో ఆయన వారి కోసం విమాన టిక్కెట్లు కొని బీహార్లోని పట్నాకు పంపించారు. పప్పన్ సోదరుడు నిరంజన్ గహ్లాట్ ఆ వలస కూలీలను విమానాశ్రయం వరకూ దిగబెట్టారు.