కరోనా టైంలో.. అధికార పార్టీవారి నిర్వాకమిది!

ABN , First Publish Date - 2021-05-06T05:42:35+05:30 IST

కొవిడ్‌ కట్టడికి అధికారులు తీవ్రంగా..

కరోనా టైంలో.. అధికార పార్టీవారి నిర్వాకమిది!
పాములపాడు మండలం పెంచికలపల్లిలో రికార్డింగ్‌ డ్యాన్స్‌

అర్ధరాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌

నరసరావుపేట నుంచి యువతులు

పెంచికలపల్లిలో అధికార పార్టీవారి నిర్వాకం

ఆకస్మిక దాడులు నిర్వహించిన డీఎస్పీ శృతి

పోలీసుల అదుపులో నిర్వాహకులు

ఆత్మకూరు(కర్నూలు): కొవిడ్‌ కట్టడికి అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ప్రభుత్వం పగటి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో బాధ్యతగా ఉండాల్సిన అధికార పార్టీ నాయకులే కట్టు తప్పారు. నిబంధనలను ఉల్లంఘించి, ఏకంగా రికార్డింగ్‌ డ్యాన్సులు ఏర్పాటు చేయించి, చిందులు వేశారు. పాములపాడు మండలం మద్దూరు పంచాయతీ మజరా పెంచికలపల్లిలో ఈ తతంగం చోటు చేసుకుంది.
 
ఆలయం సమీపంలో..
పెంచికలపల్లి గ్రామంలో వినోదం కోసం రూ.60 వేలు చెల్లించి నరసరావుపేట నుంచి ఆరుగురు యువతులను పిలిపించారు. అమ్మవారి ఆలయం సమీపపంలో మంగళవారం రాత్రి 10 గంటలకు రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. కొందరు వైసీపీ నాయకులు డ్యాన్సర్లతో కలిసి నృత్యం చేశారు. రికార్డింగ్‌ డాన్స్‌ చూసేందుకు మద్దూరు, కృష్ణానగర్‌, గుంతకందాల తదితర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చారు. కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేశారు. రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలి. కానీ అధికార పార్టీకి చెందిన నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారని తెలుస్తోంది. పైగా ఓ కీలకశాఖకు చెందిన అధికారి వీరికి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి.


డీఎస్పీ ఆర్ధరాత్రి ఆకస్మిక దాడులు

పెంచికలపల్లిలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు జరుగుతున్నాయని ఆత్మకూరు డీఎస్పీ వై.శృతికి మంగళవారం రాత్రి 11.30 గంటలకు సమాచారం వెళ్లింది. వెంటనే ఆమె స్పందించారు. నేరుగా పెంచికలపల్లికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌ స్టేజ్‌ వద్దకు డీఎస్పీ చేరుకోగానే డ్యాన్సర్లు, నిర్వాహకులతో సహా జనం పరుగులు తీశారు. డీఎస్పీ అక్కడికి చేరుకున్న అరగంట తర్వాత పాములపాడు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ గ్రామానికి వచ్చారు.


గ్రామంలో పర్యటించి అనుమతి లేకుండా రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాటు చేసిన నిర్వాహకులను, నరసరావుపేట నుంచి వచ్చిన డ్యాన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులను పాములపాడు పోలీసుస్టేషన్‌లో ఉంచి డ్యాన్సర్లను ఆత్మకూరులోని ఓ లాడ్జిలో ఉంచారు. పాములపాడు ఎస్‌ఐని ఆత్మకూరులోని తన కార్యాలయానికి బుధవారం పిలిపించి మందలించినట్లు సమాచారం. డ్యాన్సర్లకు గట్టివార్నింగ్‌ ఇచ్చి పంపించనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ సమయంలో అనుమతి లేకుండా రికార్డింగ్‌ డ్యాన్స్‌లను ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును నుంచి వైసీపీ నాయకులను తప్పించేందుకు నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

Updated Date - 2021-05-06T05:42:35+05:30 IST