మధ్యాహ్న భోజనం తిన్న 200 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-12-17T14:21:21+05:30 IST

స్థానిక పూందమల్లి నియోజకవర్గ పరిధిలోని జమీన్‌కొరట్టూరు ప్రాంతంలో మధ్యాహ్న భోజనం తీసుకున్న 200 మంది మహిళలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తిరువళ్లూర్‌ జిల్లా వెల్లవేడు

మధ్యాహ్న భోజనం తిన్న 200 మందికి అస్వస్థత

ప్యారీస్‌(చెన్నై): స్థానిక పూందమల్లి నియోజకవర్గ పరిధిలోని జమీన్‌కొరట్టూరు ప్రాంతంలో మధ్యాహ్న భోజనం తీసుకున్న 200 మంది మహిళలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తిరువళ్లూర్‌ జిల్లా వెల్లవేడు సమీపంలోని పుదుసత్రంలో ఉన్న ఓ ప్రైవేటు విడిది గృహంలో బసచేసిన 2,400 మంది మహిళలు శ్రీ పెరుంబుదూర్‌లో ఉన్న పారిశ్రామికవాడలో వున్న కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వారికి పంపిణీ చేసిన ఆహారం తిని సుమారు 200 మంది హఠాత్తుగా కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో తల్లడిల్లిపోయారు. అస్వస్థతకు గురైన వారిని సహచరులు పూందమల్లిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు, ఆ కార్మికులకు పంపిణీ చేసిన ఆహారంలో నాణ్యత కొరవడిందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. మరోవైపు రెవెన్యూ, ఆహారభద్రత శాఖల అధికారులు జమీన్‌కొరట్టూరులో ఉన్న సంబంధిత ప్రైవేటు భవనానికి గురువారం నేరుగా వెళ్లి అక్కడ కార్మికులకు కల్పించిన వసతులను తనిఖీలు చేశారు. అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో, గత రెండు రోజులుగా ఈ భవనంలో ఉన్న మహిళా కార్మికులు అస్వస్థతకు గురై బాధపడుతున్నారని, అయితే సంబంధిత నిర్వాహకులు ఈ విషయాన్ని దాచిపెట్టారని తెలిసింది. ఒకే భవనంలో 2 వేల మందికి పైగా కార్మికులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారా అన్న దానిపై విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-12-17T14:21:21+05:30 IST