కోహ్లీది ‘పిచ్చిపని’.. అశ్విన్‌ను పక్కనపెట్టడంపై మైఖేల్ వాన్

ABN , First Publish Date - 2021-09-02T22:05:06+05:30 IST

ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టాలన్న

కోహ్లీది ‘పిచ్చిపని’.. అశ్విన్‌ను పక్కనపెట్టడంపై మైఖేల్ వాన్

లండన్: ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టాలన్న విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుబట్టాడు. వరుసగా నాలుగో టెస్టులోనూ అశ్విన్‌ను పక్కనపెట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా షమీ, ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. 


ఇంగ్లండ్ పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి. దీంతో ఇండియా తుది జట్టులో అశ్విన్‌కు తప్పకుండా చోటు లభిస్తుందని అందరూ భావించారు. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు అశ్విన్ ఇక్కడ కౌంటీ క్రికెట్ ఆడాడు. సర్రే, సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. 


అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలనే భావించామని అయితే, ఇంగ్లండ్ నలుగురు లెఫ్ట్ హ్యాండర్లతో బరిలోకి దిగుతోందని కాబట్టి, రవీంద్ర జడేజాకు ఇది మంచి మ్యాచ్ అవుతుందని కోహ్లీ అన్నాడు. అయితే, అశ్విన్‌ను పక్కనపెట్టడంపై మైఖేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇండియా నిర్ణయాన్ని ‘పిచ్చిపని’గా అభివర్ణించాడు. 413 టెస్టు వికెట్లు, 5 టెస్టు సెంచరీలు ఉన్న అశ్విన్ లాంటి ఆటగాడిని పక్కనపెట్టడం ఘోర తప్పిదని పేర్కొన్నాడు. 

Updated Date - 2021-09-02T22:05:06+05:30 IST