100 నగరాల్లో మెట్రో పరుగులు: కేంద్రం

ABN , First Publish Date - 2021-10-07T22:43:45+05:30 IST

ప్రస్తుతం దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, జైపూర్, గురుగ్రామ్, నోయిడా, లఖ్‌నవూ నగరాల్లో మెట్రో అందుబాటులో ఉంది. దేశంలోని చాలా నగరాల్లో మెట్రో పనులు కొనసాగుతున్నాయి..

100 నగరాల్లో మెట్రో పరుగులు: కేంద్రం

న్యూఢిల్లీ: 2047 నాటికి దేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా దేశంలో 100 నగరాల్లో మెట్రో పరుగులు తీస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బుధవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో రెండో రోజు జరిగిన ‘న్యూ ఇండియా అర్బన్ ఎక్స్‌పో’ భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో మెట్రో అభివృద్ధిపై వివరించారు.


‘‘దేశం 2047నాటికి వందవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేసుకుంటుంది. అదే సమయానికి దేశంలోని కనీసం వంద నగరాల్లో మెట్రో రైలు పరుగుతు తీస్తుంది. ప్రస్తుతం దేశంలో 500 కిలోమీటర్ల పొడవు మెట్రో అందుబాటులో ఉంది. అయితే 2047 నాటికి ఇది ఇప్పుడు ఉన్నదానికి 10 రెట్లు (5,000 కిలోమీటర్లు) పెరుగుతుంది. కొవిడ్ ముగిస్తే కోటి మంది మెట్రోలో ప్రయాణిస్తారు. అయితే కొవిడ్ కారణంగా ప్రస్తుతం 30 నుంచి 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కొవిడ్‌కు ముందు 85 లక్షల మంది ప్రయాణించేవారు’’ అని మిశ్రా తెలిపారు.


ప్రస్తుతం దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, జైపూర్, గురుగ్రామ్, నోయిడా, లఖ్‌నవూ నగరాల్లో మెట్రో అందుబాటులో ఉంది. దేశంలోని చాలా నగరాల్లో మెట్రో పనులు కొనసాగుతున్నాయి. దేశంలో కోల్‌కతాలో 1984లోనే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలో మొదటి మెట్రో ఇదే. కాగా, ఢిల్లీలో 2002లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇది దేశంలో రెండవ మెట్రో కాగా, దేశంలోనే అతిపెద్ద, రద్దీ మెట్రో కావడం గమనార్హం.

Updated Date - 2021-10-07T22:43:45+05:30 IST