అయ్యో.. ఎంత ఘోరం?!
ABN , First Publish Date - 2022-05-24T13:29:41+05:30 IST
న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రాజా అన్నామలైపురం (ఆర్ఏపురం)లో ఆక్రమిత ఇళ్ళను కూల్చివేసిన ప్రాంతాన్ని ప్రజా ఉద్యమ సంస్థల జాతీయ కన్వీనర్, ప్రముఖ
- ఆర్ఏ పురం బాధితులకు మేధాపాట్కర్ ఓదార్పు
చెన్నై: న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రాజా అన్నామలైపురం (ఆర్ఏపురం)లో ఆక్రమిత ఇళ్ళను కూల్చివేసిన ప్రాంతాన్ని ప్రజా ఉద్యమ సంస్థల జాతీయ కన్వీనర్, ప్రముఖ సంఘసేవకురాలు మేధాపాట్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల్ని ఆమె ఓదార్చారు. జరిగిన నష్టానికి తగిన పరిహారం అందేలా, బాధితులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లిన మేధా పాట్కర్కు బాధిత కుటుంబాల వారు స్వాగతం పలికారు. ఆమెను చూడగానే కొంతమంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమకు జరిగిన నష్టం గురించి వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆర్ఏపురం గోవిందసామి నగర్లో బకింగ్హామ్ కాలువ స్థలాన్ని ఆక్రమించుకుని సుమారు రెండువందల కుటుంబాలు ఇళ్ళు నిర్మించుకుని నివసిస్తున్నాయి. కాలువ స్థలం ఆక్రమించి నిర్మించిన ఇళ్ళను తొలగించాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో వాటిని తొలగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ మేరకు అధికారులు ఆ ఇళ్ళను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పీఎంకే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్కడి బాధితులకు సమీప ప్రాంతాల్లో ఇళ్ళను కేటాయిస్తామంటూ ప్రకటించింది. అయితే తమకు మందవెల్లికి చేరువగా ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్ళను కేటాయించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేధాపాట్కర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బాధితులకు సమీప ప్రాంతాల్లోనే ఇళ్ళను కేటాయించాలని డిమాండ్ చేశారు.