Notices: మెరీనాలో 300 దుకాణాలకు నోటీసులు
ABN , First Publish Date - 2022-08-02T15:39:37+05:30 IST
స్థానిక మెరీనా తీరం(Marina Beach)లో ఉన్న దాదాపు 300 దుకాణాలకు చెన్నై నగర పాలక సంస్థ (చెన్నై కార్పొరేషన్) తాజాగా నోటీసులు జారీచేసింది.
అడయార్(చెన్నై), ఆగస్టు 1: స్థానిక మెరీనా తీరం(Marina Beach)లో ఉన్న దాదాపు 300 దుకాణాలకు చెన్నై నగర పాలక సంస్థ (చెన్నై కార్పొరేషన్) తాజాగా నోటీసులు జారీచేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశం మేరకు మెరీనా తీరంలో స్మార్ట్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. మెరీనా తీరం వెంబడి స్మార్ట్ దుకాణాలు ఏర్పా టు చేయాలని గత ఏడాది హైకోర్టు(High Court) ఆదేశించింది. దీన్ని దుకాణాల యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టు అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో మెరీనా తీరాన్ని పరిరక్షించే చర్యల్లో భాగంగా తీరం వెంబడి స్మార్ట్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు చెన్నై కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కార్పొరేషన్ అనుమతి లేకుండా వెలసిన 300 దుకాణాల యజమానులకు తాజాగా నోటీసులు జారీచేసింది. ఇదే విషయంపై కార్పొరేషన్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఒక వేళ కార్పొరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా దుకాణాల యజమానులు ఆందోళనకు దిగితే దుకాణాలను వేరే వారికి కేటాయిస్తామని స్పష్టం చేశారు. దీనిపై వ్యాపారులు మాట్లాడుతూ నిజానికి మెరీనా తీరం(Marina Beach)లో అనుమతి పొందిన దుకాణాలు 1459 మాత్రమేనని తెలిపారు. ఇపుడు 900 మాత్రమే కేటాయించనున్నారని వీటిలో 60 శాతం దుకాణాలు గతంలో ఉన్న వ్యాపారులకే కేటాయించనున్నారని పేర్కొన్నారు. మిగిలినవి ఇతరులకు కేటాయించాలని భావిస్తున్నారని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు.