జమాదులపాలెం, బయ్యవరం వీఆర్వోలకు మెమోలు

ABN , First Publish Date - 2021-10-19T06:24:41+05:30 IST

మండలంలోని విస్సన్నపేట, జమాదులపాలెం, బయ్యవరం గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా జిరాయితీ భూములను చదును చేయడంపై రెవెన్యూ అధికారులు స్పందించారు.

జమాదులపాలెం, బయ్యవరం వీఆర్వోలకు మెమోలు

‘గప్‌చుప్‌గా భూయజ్ఞం’పై స్పందించిన రెవెన్యూ అధికారులు


కశింకోట, అక్టోబరు 18: మండలంలోని విస్సన్నపేట, జమాదులపాలెం, బయ్యవరం గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా జిరాయితీ భూములను చదును చేయడంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. బయ్యవరం, జమాదులపాలెం వీఆర్వోలకు తహసీల్దార్‌ బి.సుధాకర్‌ సోమవారం మెమోలు జారీచేశారు. బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 195/2లోని భూములను కొంతమంది బడాబాబులు కొనుగోలు చేసి, చదును చేస్తున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు  అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భూములను పూర్తిస్థాయిలో సర్వే చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో బయ్యవరం వీఆర్వో తొమ్మండ్రు అప్పారావు, జమాదులపాలెం వీఆర్వో నారాయణరావులను సంజాయిషీ కోరుతూ తహసీల్దార్‌ బి.సుధాకర్‌  మెమోలు జారీ చేశారు. 


కరోనా కేసులు 11..

ఆరున్నర నెలల తరువాత కనిష్ఠ స్థాయిలో నమోదు

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆరున్నర నెలల తరువాత సోమవారం కనిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి ఎనిమిదో తేదీన ఇద్దరికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. నాటి నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అయితే వైరస్‌ విజృంభించింది. వేలాది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జూన్‌ నుంచి కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. కానీ, ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే, మార్చి ఎనిమిది తరువాత (195 రోజులు) సోమవారం అత్యల్పంగా 11 మంది కేసులు వచ్చాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 1,57,821 అయ్యాయి. ఇందులో 1,55,919 మంది కోలుకోగా, మరో 808 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందడంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 1094కు చేరింది. 


పరీక్ష విధానంలో మార్పులు

ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ప్రశ్నపత్రాలు

ప్రధానోపాధ్యాయుల మెయిల్‌కు గంట ముందు పంపేలా ఏర్పాట్లు

ఆ మరుసటిరోజే మూల్యాంకనం

ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ

భీమునిపట్నం రూరల్‌, అక్టోబరు 18: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నూతన విధానంలో పరీక్షలను నిర్వహించాలని విద్యా శాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఇంతవరకు పేపర్లను ఉపాధ్యాయులకు అందించి పరీక్షలను నిర్వహించేవారు. కానీ ఈనెల 21 నుంచి జరగనున్న పరీక్షల విషయంలో వినూత్న మార్పులను చేశారు. ఏరోజుకారోజు ప్రశ్నపత్రాలను గంట ముందు ఎన్‌సీఈఆర్‌టి నుంచి ప్రధానోపాధ్యాయులకు మెయిల్‌ ద్వారా పంపిస్తారు. ఆ ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయులు బోర్డు మీద రాసి విద్యార్థులకు పరీక్షలను నిర్వహించవలసి ఉంటుంది. జవాబు పత్రాలను ఆ మరునాడే మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం చేసిన పత్రాలను ప్రధానోపాధ్యాయులు తనిఖీ చేయాలి. ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో నమోదుచేసి తల్లిదండ్రులకు ప్రోగ్రెస్‌ కార్డులను ఇవ్వాలి. పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి నవంబరు ఒకటో తేదీ నుంచి ప్రత్యేక బోధన నిర్వహించవలసి ఉంటుంది.

పరీక్షల షెడ్యూలు

ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 21న తెలుగు, 22న ఆంగ్లం, 23న గణితం, 25న పరిసరాల విజ్ఞానం పరీక్షలను నిర్వహించాలి. ఉన్నత పాఠశాలల్లో 21న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 22న ఉదయం హిందీ, మధ్యాహ్నం 6,7, తరగతులకు సైన్స్‌, 8,9,10 తరగతులకు భౌతిక శాస్త్రం, 23వ తేదీ ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలను, 25న జీవశాస్త్ర పరీక్షను నిర్వహించాలని కోరారు. 24న ఆదివారం అయినందున పరీక్ష వుండదని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-19T06:24:41+05:30 IST