ఆలయ బంగారం కరిగించడం కొత్త కాదు: తమిళనాడు

ABN , First Publish Date - 2021-10-13T20:16:53+05:30 IST

తమిళనాడులోని హిందూ దేవాలయాలకు చెందిన బంగారు ఆభరణాలను

ఆలయ బంగారం కరిగించడం కొత్త కాదు: తమిళనాడు

చెన్నై : తమిళనాడులోని హిందూ దేవాలయాలకు చెందిన బంగారు ఆభరణాలను కరిగించడం కొత్త విషయమేమీ కాదని మద్రాస్ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ సెప్టెంబరు 9, 22 తేదీల్లో జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఈ విధంగా స్పందించింది. 


దేవాలయాలకు చెందిన బంగారు ఆభరణాలను కరిగించే విధానం 1977 నుంచి అమలవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గోల్డ్ మానెటైజేషన్ స్కీమ్ గురించి అవగాహన లేకుండా కొందరు రాద్ధాంతం చేస్తున్నారని అడ్వకేట్ జనరల్ ఆర్ షణ్ముగసుందరం అన్నారు.  ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల గ్రాముల ఆభరణాలను కరిగించి, కడ్డీల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రూ.11 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. దాదాపు 2,137 కేజీల బంగారు ఆభరణాలను ముంబైలోని ప్రభుత్వ టంకశాలలో కరిగించాలని, బంగారు కడ్డీలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


ఈ పిటిషన్లను ఎం శరవణన్, గోపాలకృష్ణన్ దాఖలు చేశారు. కేవలం దేవాలయాలను పరిపాలించడం మాత్రమే హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ కర్తవ్యమని, దేవాలయాల్లోని బంగారాన్ని తాకే అధికారం లేదని వాదించారు. తదుపరి విచారణ అక్టోబరు 21న జరుగుతుంది.


Updated Date - 2021-10-13T20:16:53+05:30 IST