అనుమతులు వచ్చేనా...?
ABN , First Publish Date - 2022-08-09T03:47:53+05:30 IST
మంచిర్యాల వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమతుల జారీపై అయోమయ పరిస్ధితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి పునాది పడింది. జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ శాఖ బీట్ మార్కెట్ ఆవరణను వైద్య కళాశాలకు కేటాయించారు. బీట్ మార్కెట్ గోదాములకు మార్పులు, చేర్పులు చేసి కళాశాల కోసం వినియోగించనుండగా తరగతి గదులు ఇతరత్రా అవసరాల కోసం రూ. 11 కోట్ల వ్యయంతో నూతన నిర్మాణాలను సైతం చేపట్టారు. కళాశాల నిర్వహణకు అవసరమైన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా అనుమతులు లభించడమే మిగిలి ఉంది.
వైద్య కళాశాలలో చివరి దశ నిర్మాణ పనులు
ఇప్పటికే రెండు దఫాలుగా తనిఖీలు పూర్తి
10 రోజుల్లో వెలువడనున్న నీట్ ఫలితాలు
మూడో దశ తనిఖీలపైనే విద్యార్థుల ఆశలు
ఎన్ఎంసీ అనుమతులపై అయోమయం
మంచిర్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమతుల జారీపై అయోమయ పరిస్ధితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి పునాది పడింది. జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ శాఖ బీట్ మార్కెట్ ఆవరణను వైద్య కళాశాలకు కేటాయించారు. బీట్ మార్కెట్ గోదాములకు మార్పులు, చేర్పులు చేసి కళాశాల కోసం వినియోగించనుండగా తరగతి గదులు ఇతరత్రా అవసరాల కోసం రూ. 11 కోట్ల వ్యయంతో నూతన నిర్మాణాలను సైతం చేపట్టారు. కళాశాల నిర్వహణకు అవసరమైన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా అనుమతులు లభించడమే మిగిలి ఉంది. ఎన్ఎంసీ బృందం ఇప్పటికి రెండు సార్లు కళాశాలను తనిఖీ చేసి సంతృప్తి చెందకపోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో ఆ మేరకు పనులు సైతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎన్ఎంసీ సూచనతో మార్పులు
ఎన్ఎంసీ బృందం రెండుసార్లు పర్యటనలో సూచించిన విధంగా అధికారులు వైద్య కళాశాలలో మార్పులు చేర్పులు చేపట్టినప్పటికీ మూడో విడత తనిఖీలపైనే సర్వత్రా ఆధారపడి ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్వరలో విద్యా సంవత్సరం ఆరంభం కానుండగా ఈలోపు ఎన్ఎంసీ బృందం మూడో విడత తనిఖీలు చేపట్టనుంది. ఆ తనిఖీల్లో నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉంటేనే అనుమ తులు లభించే అవకాశాలు ఉన్నాయి. రానున్న వారం రోజుల్లో ఎన్ఎంసీ తనిఖీలు ఉండే అవకాశాలు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎండీ సులేమాన్ సూచనప్రాయంగా తెలిపారు. తరగతుల బోధనకు సంబంఽ దించి ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితర సిబ్బంది నియామకం జరిగింది. ఇదిలా ఉండగా మంచిర్యాల కళాశాలతో పాటు లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్వోపీ) కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలల్లో సంగారెడ్డి, వనపర్తి, కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, రామగుండం, వైద్య కళాశాలలకు అనుమతులు రావాల్సి ఉంది. వీటిలో నాగర్కర్నూల్ కళాశాలకు ఈ ఏడాది అడ్మిషన్లకు ఎన్ఎంసీ అంగీకారం తెలిపింది.
కౌన్సెలింగ్ నాటికి వచ్చేనా...?
జూలై 17న నీట్ పరీక్ష జరగగా పది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. అనంతరం నెల రోజుల్లోపు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆలోపు మంచిర్యాల కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు లభిస్తాయో లేదో అనే సందేహం నెలకొంది. కౌన్సెలింగ్కు ముందే కొత్త కళాశాలలన్నింటికి ఎన్ఎంసీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అనుమతులు వస్తేనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంతో ఎల్ఓపీ ఆలస్యమైతే విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఎల్వోపీ వస్తే రిజిస్ర్టేషన్ చేసుకొని విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చేం దుకు అవకాశం ఉంటుంది. వైద్య విద్య అభ్యసించే వారిలో తమ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండేలా కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశా లుంటాయి. అందుకు తగ్గట్టుగా వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటారు. ఎల్ఓపీ వస్తే మంచిర్యాల కళాశాలలో ప్రథమ సంవత్సరానికి సంబంఽధించి 150 సీట్లు అందుబాటులో ఉంటాయి. దీంతో ఎన్ఎంసీ అనుమతులపైనే ఇక్కడి విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం....
డా. ఎండీ సులేమాన్, ప్రిన్సిపాల్, మెడికల్ కళాశాల
వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లన్ని సిద్ధం చేశాం. కళాశాలకు అనుమతులు వస్తే ఈ ఏడాది ఎంబీబీఎస్లో 150 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థుల ఉపయోగార్ధం అనుమతులు త్వరగా వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. తరగతుల బోధనకు ప్రస్తుతం కళాశాల సిద్ధంగా ఉంది. ఎన్ఎంసీ సూచనల మేరకు అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. అనుమతులు అనుకూలంగా వస్తాయనే ఆశాభావంలో ఉన్నాం.