మెగా వ్యాక్సినేషన్ సక్సెస్
ABN , First Publish Date - 2021-07-27T06:18:16+05:30 IST
జిల్లావ్యాప్తంగా సోమవారం మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగింది. ఉదయం 9గంటల నుంచి పీహెచ్సీల పరిధిలో ఏర్పాటుచేసిన కేంద్రాలతో పాటు, పలు ప్రాంతాల్లోని సచివాలయాల వద్ద కూడా టీకాలను వేశారు.
కేంద్రాలకు భారీగా తరలివచ్చిన ప్రజానీకం
కొన్ని ప్రాంతాల్లో సచివాలయాల్లోనూ టీకాలు
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 26: జిల్లావ్యాప్తంగా సోమవారం మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగింది. ఉదయం 9గంటల నుంచి పీహెచ్సీల పరిధిలో ఏర్పాటుచేసిన కేంద్రాలతో పాటు, పలు ప్రాంతాల్లోని సచివాలయాల వద్ద కూడా టీకాలను వేశారు. జిల్లావ్యాప్తంగా లక్షమందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొని వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. కొవిషీల్డ్ 1.20 లక్షలు, కొవాగ్జిన్ 5వేల డోసులను సరఫరా చేశారు. మొత్తం 112 కేంద్రాల్లో 79,204 మందికి టీకా వేశారు. కొవాగ్జిన్ రెండో డోసు వారికే అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. ఒంగోలులో ఎక్కువమంది కొవాగ్జిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆమేర స్టాక్ లేకపోవడంతో కొంతమంది తిరిగి వెనక్కు వెళ్లిపోగా, మరికొంతమంది కొవిషీల్డ్నే వేయించుకున్నారు. 18 ఏళ్లుపైబడిన వారందరికీ టీకాలు వేస్తుండటంతో ఆయా కేంద్రాల వద్ద యువత ఎక్కువగా కనిపించారు. కొన్ని చోట్ల బారులు తీరాల్సి రావడంతో ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో అనేక మంది భయపడ్డారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది.