సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-08-16T08:52:29+05:30 IST
స్వాతంత్య్ర వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. మంత్రులు తమ తమ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కేంద్రాన్ని చేతులు జోడించి అడుగుతున్నా: కేటీఆర్
సిరిసిల్లలో జాతీయ పతాక ఆవిష్కరణ
రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు
జిల్లాల్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
(ఆంధ్రజ్యోతి నెట్వర్క్)
స్వాతంత్య్ర వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. మంత్రులు తమ తమ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో మంత్రి కేటీఆర్ సోమవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ఆయన కాలికి గాయమైన నేపథ్యంలో ప్రత్యేక వ్యాన్లో వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మట్లాడారు. సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ’చేతులు జోడించి అడుగుతున్నాను’ అన్నారు. ఇప్పటికే పలుమార్లు అడిగామని గుర్తు చేశారు.నేతన్న బీమాతో రాష్ట్రంలోని 80వేల మంది చేనేత, పవర్లూమ్ కార్మికులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జెండాల తయారీ కోసం తెలంగాణకు 12 రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. జెండాల తయారీలో సిరిసిల్ల ప్రధాన పాత్ర పోషించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఖిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఎగురవేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం జెండా ఎగురువేశారు.
7వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా సిద్ధం
తెలంగాణ విద్యుత్ రంగం దేశానికే ఆదర్శంగా ఉందని ట్రాన్స్కో/జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. విద్యుత్సౌధలో ఆయన పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. రానున్న రోజుల్లో 17 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.