సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
ABN , First Publish Date - 2020-11-28T05:38:03+05:30 IST
సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
శామీర్పేట: మూడుచింతలపల్లి మండల పరిషత్లో ఎంపీపీ హారిక మురళీ గౌడ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు బహిష్కరించారు. మండల స్థాయి అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం, మండల పరిషత్ నుంచి ఎంపీటీసీలకు అభివృద్ధి నిధులను కేటాయించకపోవడం, ధరణి పోర్టల్ ప్రారంభోత్సవంలో సీఎం సభ కార్యక్రమానికి ముందు లక్ష్మాపూర్ ఎంపీటీసీ నాగరాజును అరెస్టు చేసినందుకు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ మూడుచింతలపల్లి మండలం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సర్వసభ్య సమావేశాల్లో సంబంధిత శాఖల నుంచి పూర్తిస్థాయి మండల అధికారులు పాల్గొనకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గత సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎంపీటీసీలుగా గెలిచి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోనె హనుమంతరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాజు, అఖిల్రెడ్డి పాల్గొన్నారు.