మెడ్టెక్... చంద్రబాబు విజన్: కాల్వ
ABN , First Publish Date - 2020-04-10T07:04:41+05:30 IST
విశాఖ మెడ్టెక్ జోన్లో కరోనాపై యుద్ధానికి అవసరమైన ఆయుధాలు తయారవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా జోన్ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఆరోపణలు...
- అక్కడ తయారైన పరికరాలతో ఫోజులా!: బుద్దా
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): విశాఖ మెడ్టెక్ జోన్లో కరోనాపై యుద్ధానికి అవసరమైన ఆయుధాలు తయారవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా జోన్ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతా విచారణ చేస్తామంటూ ప్రకటించింది. తాజాగా కరోనా నేపథ్యంలో అదే మెడ్టెక్ జోన్ అక్కరకు రావడంతో టీడీపీ నేతలు వరుసగా వైసీపీపై మాటల దాడికి దిగారు. గురువారం ట్విటర్ వేదికగా పలువురు నేతలు చంద్రబాబు ముందుచూపును పొగుడుతూ, వైసీపీ నేతల తీరును దునుమాడారు. ‘‘2016లో చంద్రబాబు శంకుస్థాపన చేసి 2018లో ప్రారంభించిన మెడ్టెక్ జోన్ కరోనా కష్ట సమయంలో కాంతి రేఖలా కనిపించింది. ఇదీ చంద్రబాబు విజన్ అంటే!’’ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్వీట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ‘‘మెడ్టెక్ జోన్లో అవినీతి జరిగింది, విచారణ చేస్తున్నాం అంటూ హడావుడి చేశారు. ఇప్పుడు అదే మెడ్టెక్లో తయారైన వైద్య పరికరాలను పట్టుకుని.. తానే చేయించానంటూ మీడియాకు ఫోజులివ్వడానికి సిగ్గు అడ్డురాలేదా జగన్ గారూ?’’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా కేసు మొట్టమొదట చైనాలో 2019 డిసెంబరులో నమోదయితే, 2020 జనవరిలో ప్రపంచానికి తెలిసింది. కానీ జగన్ మాత్రం 2019 ఆగస్టులోనే కరోనా వస్తుందని కల కని, వైద్య పరికరాలు తయారు చేయించాననడం హాస్యాస్పదంగా ఉంది. పైగా కరోనాని ఎదుర్కొన్న ధీరుడు జగన్ అని వైసీపీ నేతలు డప్పు కొట్టడం వింతగా ఉందని విమర్శించారు.