అదే ధ్యానం

ABN , First Publish Date - 2021-11-26T05:30:00+05:30 IST

’ధ్యానం అంటే ఏమిటి? ఆ స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి?’ అనే ప్రశ్న ఒక బాలుణ్ణి వేధిస్తూ ఉండేది. తల్లితండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను అడిగి తన సందేహం తీర్చుకోవడానికి అతను..

అదే ధ్యానం

’ధ్యానం అంటే ఏమిటి? ఆ స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి?’ అనే ప్రశ్న ఒక బాలుణ్ణి వేధిస్తూ ఉండేది. తల్లితండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను అడిగి తన సందేహం తీర్చుకోవడానికి అతను ప్రయత్నించాడు. కానీ సంతృప్తికరమైన సమాధానం ఎక్కడా దొరకలేదు. 


   చివరకు అతను తల్లితండ్రులతో కలిసి అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. స్వామిని దర్శించుకున్నాక... తన సందేహాన్ని ఆయన ముందు ఉంచాడు. 

ఆ ప్రశ్న విని శ్రీరమణులు నవ్వారు. అతణ్ణి తనకు దగ్గరగా కూర్చోమన్నారు. తన భక్త బృందంలో ఒకరిని పిలిచి... ‘‘వంట గది నుంచి ఒక దోశె తీసుకువచ్చి ఈ కుర్రాడికి ఇవ్వు’’ అని చెప్పారు.

ఆ భక్తుడు అరిటాకులో దోశె తీసుకువచ్చి, ఆ బాలుడి ముందు ఉంచాడు. 


‘‘నేను ఒకసారి ‘ఊ...!’ అంటాను. అప్పుడు మాత్రమే నువ్వు తినడం మొదలుపెట్టాలి. ఆ తరువాత మళ్ళీ ‘ఊ...’ అనే లోగా దోశె పూర్తిగా తినెయ్యకూడదు. కానీ నేను రెండోసారి ‘ఊ...’ అన్న తరువాత ఆకులో దోశె మిగలకూడదు’’ అని చెప్పారు.


ఆ కుర్రాడు అలాగేనని తల ఊపాడు.

చుట్టూ ఉన్నవారు ఇదంతా ఆసక్తిగా చూస్తున్నారు. ‘స్వామి ‘ఊ...’ అని ఎప్పుడు అంటారా?’ అని ఆ కుర్రాడు ఆత్రుతగా నిరీక్షిస్తున్నాడు. 

రమణ మహర్షి ‘ఊ...’ అన్నారు. అతను తినడం మొదలుపెట్టాడు. ఒకవైపు దోశె తింటూనే, మళ్ళీ ఆయన నుంచి సంకేతం ఎప్పుడు వస్తుందా? అని శ్రీరమణులను గమనిస్తున్నాడు. ఆయన మరోసారి ‘ఊ...’ అనేలోగా దోశెను దాదాపు పూర్తి చెయ్యడానికి హడావిడి పడుతున్నాడు. పెద్ద పెద్ద ముక్కలు విరిచి తింటున్నాడు. చేతులు ఆ పని చేస్తున్నా, అతని దృష్టంతా రమణుల మీదే ఉంది. 


ఆకులో దోశె ఓ చిన్న ముక్క మాత్రమే మిగిలింది. రెండోసారి స్వామి నుంచి సంకేతం రాగానే, ఆ దోశె ముక్కను నోట్లో పెట్టేసుకున్నాడు.

‘‘నీ దృష్టి ఎక్కడుంది? నా మీదా? దోశె మీదా? అని అడిగారు శ్రీరమణులు.

‘‘రెండిటి మీదా’’ అన్నాడు కుర్రవాడు.


‘‘అవును. నువ్వు దోశెను పూర్తి చెయ్యడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నావు. అదే సమయంలో నా మీద నీ దృష్టి నిలిపి ఉంచావు. ఇప్పుడు నువ్వు చేసింది ధ్యాన ప్రక్రియే. నీ దృష్టిని దేవుడి మీద ఏకాగ్రతతో నిలిపి ఉంచాలి. అదే సమయంలో నీ రోజువారీ కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉండాలి. అంటే... నడవడం, తినడం, మాట్లాడడం లాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ పనులన్నీ చేస్తున్నప్పటికీ... అన్ని సమయాల్లో మన మనసు మాత్రం దేవుడి మీదే లగ్నమై ఉండాలి. అదే ధ్యానం’’ అని చెప్పారు శ్రీ రమణులు. 

Updated Date - 2021-11-26T05:30:00+05:30 IST