Shocking : పాతికేళ్ల వయస్సులోనే ఎంతమందికి హైపర్టెన్షన్ ఉందో తెలిస్తే..
ABN , First Publish Date - 2022-05-17T11:58:13+05:30 IST
పాతికేళ్ల వయస్సులోనే ఎంతమందికి హైపర్టెన్షన్ ఉందో తెలిస్తే..
- 30 శాతం మందికి..
- పార్కులకు వచ్చే వారిపై మెడికవర్ ఆస్పత్రి సర్వే
హైదరాబాద్ సిటీ : పాతికేళ్ల వయస్సులోనే హైపర్టెన్షన్తో (Hypertension) బాధపడుతున్నట్లు సర్వేలో (Survey) తేలింది. ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు మెడికవర్ ఆస్పత్రి ఇటీవల అధ్యయనం చేపట్టింది. లోటస్, కృష్ణకాంత్ పార్కుల (Parks) వద్దకు వచ్చిన సందర్శకులు, వాకర్స్కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. దాదాపు 300 మందికిపైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 30 శాతం మంది హైపర్టెన్షన్ ఉన్నట్లు తేలింది.
25 ఏళ్ల వారే అధికం..
తమ అధ్యయనంలో ఎక్కువ శాతం మంది 25 ఏళ్ల వయస్సు వారు ఉన్నట్లు గుర్తించినట్లు సీనియర్ కార్డియాలజిస్టు, ఆస్పత్రి క్లినికల్ సర్కీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి తెలిపారు. గుండె, పక్షవాతం, మూత్ర పిండాల జబ్బులకు హైపర్టెన్షన్ కారణమవుతుందని చెప్పారు. చాలా మందిలో లక్షణాలు బయటపడడం లేదని, దీంతో తమకు అధిక రక్తపోటు ఉన్నట్లు ఎవరూ గుర్తించడం లేదని ఆయన వివరించారు. దేశంలో 60 నుంచి 70 శాతం మందికి తమకు అధిక రక్తపోటు ఉన్నట్లు తెలియదని చెప్పారు. కేవలం 30 శాతం మందికి మాత్రమే ఆరోగ్య పరిస్థితిపై అవగాహన ఉన్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతుండగా, అందులో సగం మంది సమస్యను గుర్తించలేకపోయారన్నారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ బీపీ 140/90 లోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు.