మెడిసిన్ ర్యాంకుల జాబితా విడుదల
ABN , First Publish Date - 2022-01-25T14:09:31+05:30 IST
ఈ విద్యా సంవత్సర ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ర్యాంకుల జాబితా సోమవారం విడుద లైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గత డిసెంబరు
పెరంబూర్(చెన్నై): ఈ విద్యా సంవత్సర ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ర్యాంకుల జాబితా సోమవారం విడుద లైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గత డిసెంబరు 19న ప్రారంభమై ఈ నెల 7వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అందులో ప్రభుత్వ కోటాలో 25,511 మంది, మేనేజ్ మెంట్ కోటా సీట్లకు 14,777 మంది మొత్తం 40,288 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన ముగిసిన నేపథ్యంలో, కీల్పాక్కం ప్రభుత్వ వైద్యకళాశాల ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్ ర్యాంకుల జాబితా విడుదల చేశారు. ప్రభుత్వ కోటాకు సంబంధించిన ర్యాంకుల జాబితాలో నామక్కల్ జిల్లాకు చెందిన ఎస్ఏ గీతాంజలి, అదే జిల్లాకు చెందిన ప్రవీణ్ 710 మార్కులతో మొదటి, రెండు ర్యాంకులు సాధించారు. అలాగే, అన్నానగర్ వెస్ట్కు చెందిన ప్రశేన్జితన్ మూడో ర్యాంకు (710 మార్కులు), తంజావూరు జిల్లాకు చెందిన ఆర్.అరవింద్ నాలుగో ర్యాంకు (710 మార్కులు), చెన్నై మొగప్పెయిర్ వెస్ట్కు చెందిన హయగ్రీవాస్ ఐదో ర్యాంకు (705 మార్కులు), సేలంకు చెందిన అర్చిత ఆరో ర్యాంకు (705 మార్కులు), తూత్తుకుడికి చెందిన హరన్సామ్రాజ్ ఏడో ర్యాంకు (705 మార్కులు), సైదాపేటకు చెందిన నేయకావ్య చందర్ ఎనిమిదో ర్యాంకు (701 మార్కులు), కొట్టివాక్కంకు చెందిన కెర్రిన్ ఇమ్మానుయేల్ 9వ ర్యాంకు (700 మార్కులు), సేలం జిల్లాకు చెందిన మణిమారన్ 10వ ర్యాంకు (697 మార్కులు) సాధించారు.
మేనేజ్మెంట్ కోటాలో...
మేనేజ్మెంట్ కోటాలో తిరుప్పూర్ జిల్లాకు చెందిన ఆర్ఆర్ కవినేష్ మొదటి ర్యాంకు (710 మార్కులు), కేరళ రాష్ట్రం మల్లాపురానికి చెందిన హందారెహ్మాన్ రెండో ర్యాంకు (701 మార్కులు), వేలూరు జిల్లాకు చెందిన శ్రీల్సుసన్ మాథ్యూ మూడో ర్యాంకు (700 మార్కులు) సాధించారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 4,349 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 2,650 మొత్తం 6,999 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ర్యాంకుల జాబితా www.tn medicalselection.net, www.tnhealth.tn. gov.in వెబ్సైట్లో విడుదల చేసినట్లు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.
27 నుంచి కౌన్సెలింగ్...
ఈ నెల 27వ తేది దివ్యాంగులు, మాజీ సైనికుల వారసులు, క్రీడాకారుల విభాగాలకు కౌన్సెలింగ్ జరుగనుంది. 28,29 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేటాయించిన 7.5 శాతం సీట్లకు, అనంతరం 30 నుంచి జనరల్ విభాగంలో కౌన్సెలింగ్ జరుగనుంది. ఈ ఏడాది ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇదిలా వుండగా ర్యాంకులు పొందిన తొలి 20 మందిలో ఒక్కరు మాత్రమే రాష్ట్ర సిల్బస్ చదివిన వారు కాగా, మిగిలిన వారంతా సీబీఎస్సీ చదివిన వారు కావడం గమనార్హం.